ఆ నిబంధనలు మార్చండి: స్టార్టప్ కంపెనీల డిమాండ్
దేశంలోని స్టార్టుప్ కంపెనీలు కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ నిబంధనలు మార్చాలని కోరుతున్నాయి. ప్రస్తుత నిబంధనలు తమకు ఆటంకంగా ఉన్నాయని, అందుకే, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు దేశంలోని యునికార్న్ కంపెనీల్లో కొన్ని ప్రధాన స్టార్టుప్ లు ఈ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఓలా , లెన్స్ కార్ట్ వంటి ప్రధాన కంపెనీలు ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందుకోసం ఒక సంస్థ స్టాక్ మార్కెట్ రెగ్యూలేటర్ సెబీ తో మంతనాలు జరుపుతున్నట్లు వినికిడి. అయితే, స్టార్టప్ కంపెనీలు చేస్తున్న డిమాండ్లను సెబీ పరిగణలోకి తీసుకొంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మన దేశంలో విజయవంతమైన చాలా స్టార్టుప్ కంపెనీల ప్రోమోటర్లకు ఆయా కంపెనీల్లో నిబంధనల మేరకు వాటాలు లేకపోవటమే ప్రస్తుత లాబీయింగ్ కు కారణం అని చెబుతున్నారు.
20% వాటా తప్పనిసరి...
దేశంలో ఏ కంపెనీ అయినా సరే... స్టాక్ మార్కెట్ల లిస్ట్ అవ్వాలంటే... తప్పనిసరిగా ఆ కంపెనీ ప్రమోటర్ల వాటా 20% ఉండాలన్నది సెబీ నిబంధన. కానీ మన దేశంలో ఉన్న చాలా వరకు యునికార్న్ స్టార్టుప్ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా ఇందుకు తగినట్లుగా లేదు. కొన్ని కంపెనీల్లో అయితే, ఏకంగా ఇది 10% లోపునకు పడిపోయింది. కంపెనీల వృద్ధి కోసం ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి నిధులు సమీకరించటం వల్ల ప్రమోటర్ల వాటా అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. అయినా సరే... అదే ఫౌండర్లను కంపెనీలను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన పూర్తిగా తొలగించాలని లేదా కనీసం స్టార్టుప్ కంపెనీల వరకు సడలించాలని ఇవి సెబీ ని డిమాండ్ చేస్తున్నాయి.
నష్టాలూ కారణమే...
భారత్ లో దాదాపు ఏ స్టార్టుప్ కంపెనీ కూడా లాభాలు ఆర్జించటం లేదు. ఏదో ఒకటి, రెండు కంపెనీలను మినహాయిస్తే ... మిగితా కంపెనీలన్నిటిదీ ఒకటే దారి. భారీ నష్టాలను మూటకట్టుకోవటమే. ఇందుకు ఫ్లిప్కార్ట్, ఓలా , పేటీఎం, బిగ్ బాస్కెట్, స్విగ్గి, జొమాటో వంటి పాపులర్ స్టార్టుప్ కంపెనీలు వాండ్ల కోట్ల లో నష్టాలు చవి చూస్తున్నాయి. సహజంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే కంపెనీలు తప్పని సరిగా లాభాలు ఆర్జించాలన్నది నిబంధన. కాబట్టి.... ఇది కూడా స్టార్టుప్ కంపెనీల లిస్టింగ్ కు ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. అందుకే, కొన్ని కంపెనీలు కలిసి ఒక లాబీయింగ్ ఏజెన్సీ ద్వారా సెబీ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మూడో స్థానం లో భారత్...
ప్రపంచంలోనే అత్యధికంగా స్టార్టుప్ కంపెనీలు ఏర్పాటు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత ఈ విషంయంలో దూసుకుపోతోంది. అనధికారిక అంచనాల ప్రకారం సుమారు 30,000 స్టార్టుప్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్టర్ కానీ కంపెనీల సంఖ్య ఇంకొంత అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఇందులో సుమారు 90% కంపెనీలు 3.5 ఏళ్లలో మూత పడుతున్నాయి. కేవలం 5% కంపెనీలు 5 ఏళ్లకు పైగా కార్యకలాపాలు కొనసాగించగా... విజయవంతం అవుతున్నవి కేవలం 5% కంపెనీలు మాత్రమే. ఇంత తక్కువ సక్సెస్ రేటు ఉన్నప్పటికీ.... యువత తమ ఆలోచనలను కార్య రూపంలోకి తీసుకెళ్లేందుకు ముందడుగు వేస్తుండటంతో స్టార్టుప్ కంపెనీలు పెరుగుతున్నాయి.
మార్చడం కష్టమే...
నిబంధనలు మార్చాలని సెబీ ని స్టార్టుప్ కంపెనీలు కోరుతున్నా... వాటిని మార్చటం అంత సులభం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదో నాలుగు ఐదు కంపెనీల కోసం మొత్తం దేశంలోని కంపెనీలకు వర్తించే నియమాలను మార్చితే... ముందు ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. సులభతరమైన నిబంధలు వల్ల ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి ... ఆ తర్వాత కంపెనీ లాభాలు గడించక పోతే తీవ్రంగా నష్ట పోయేది రిటైల్ ఇన్వెస్టర్లే. అసలే మన దేశంలో రెండు కోట్ల మంది మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పటికే వారు రూ 15 లక్షల కోట్లు పోగొట్టుకొని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి డిమాండ్లకు తలొగ్గి సెబీ నిబంధలను మార్చకూడదని సూచిస్తున్నారు.