ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఫలితాలు 2019 విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వీటిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు జరిగిన పదిరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
ఈ పరీక్షకు మొత్తం పంతొమ్మిదిన్నర లక్షల మందికి పైగా హాజరయ్యారు. నియామక పరీక్షల్లో 1,98,184 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్ కేటగిరీలో 24,583 మంది, బీసీ కేటగిరీలో 1,00,494 మంది, ఎస్సీ కేటగిరీలో 63,629, ఎస్టీ కేటగిరీలో 9,458 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,28,728 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పరీక్షల కోసం 21.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రెండు లక్షల మంది పరీక్షలకు హాజరు కాలేదు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీన విధుల్లో చేరుతారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుంది. నెలకు రూ.15వేలు ఇస్తారు.
లక్షలాది మంది ఫలితాలు చూసుకునేందుకు వెబ్ సైట్స్ ఓపెన్ చేయగా ఏపీ గ్రామ సచివాలయ వెబ్ సైట్ మొరాయించింది. అభ్యర్థులు ఫలితాలు చూసుకునేందుకు నిరీక్షించవలసి వచ్చింది. ఫలితాలు ఈ వెబ్ సైట్లలో చూసుకోవచ్చు....
http://gramasachivalayam.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/