చలాన్ షాకింగ్: ఎడ్లబండికి రూ.1,000 జరిమానా, ఏం జరిగిందంటే?
డెహ్రాడూన్: కేంద్రం ఇటీవల కొత్త వాహన చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా పడుతోంది. హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా రూ.1000 నుంచి రూ.10,000 అంతకంటే ఎక్కువ జరిమానాలను చవి చూస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లో ఓ ఎడ్లబండికి రూ.1000 జరిమానా విధించడం గమనార్హం.
భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్, రూ.6 పెరగనున్న పెట్రోల్
రైతు పొలం వద్ద ఎడ్ల బండిని నిలిపితే ఫైన్
ఈ సంఘటన ఉత్తరాఖండ్లో శనివారం నాడు చోటు చేసుకుంది. డెహ్రాడూన్కు చెందిన ఓ రైతు తన పొలం వద్ద ఎడ్ల బండిని నిలిపి ఉంచాడు. దానిని గమనించిన పోలీసులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రూ.1000 జరిమానా విధించారు.
ఎంవీ యాక్ట్ ప్రకారం రూ.1000 జరిమానా
ఎస్సై పంకజ్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ టీమ్ ఆ ఏరియాలో ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. అదే సమయంలో డెహ్రాడూన్ ఔట్స్కర్ట్స్లోని తన పొలం సమీపంలో రైతు ఎడ్ల బండిని నిలిపి ఉంచారు. అది ఎవరిదో పోలీసులు తెలుసుకొని, అతనికి జరిమానా విధించారు. అతనికి మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 81 కింద రూ.1000 జరిమానా విధించారు.
దీనికి చలాన్ విధించడం ఏమిటి?
అయితే, తాను తన పొలం సమీపంలో ఎడ్ల బండి నిలిపి ఉంచానని రైతు చెప్పారు. దీనికి చలాన్ విధించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై స్థానిక పోలీస్ అధికారి విచారించి, అసలు విషయం తెలుసుకొని, చలాన్ రద్దు చేశారు. ఈ విషయం మీడియాలో వైరల్గా మారింది.