రైల్వే స్టేషన్లో కొత్త రూల్స్, 5 ని.లు దాటినా రూ.1,000 వరకు ఫైన్
హైదరాబాద్: సాధారణంగా మనం.. కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను రైలు ఎక్కించేందుకు స్టేషన్లోకి వెళ్తాం. రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు ప్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుంటాం. ఈ టిక్కెట్ తీసుకున్న తర్వాత స్టేషన్లో ఉండేందుకు పరిమిత సమయం ఉంటుంది. అలాగే, మనం బైక్ పైన లేదా కార్లో వెళ్లినప్పుడు కొద్ది నిమిషాల్లోనే వస్తామని ఎక్కడో ఓ చోట పెడతాం. ఇలాంటి సమయంలో అదనపు సమయం తీసుకుంటే ఇక నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ జరిమానా చెల్లించవలసిందే.
తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి
5 నిమిషాలు ఆలస్యమైనా భారీ జరిమానా
కారును పార్కింగ్ స్థలంలో కాకుండా స్టేషన్ ప్రవేశ ద్వారం లేదా దాని చుట్టుపక్కల పెట్టి లోపలకు వెళ్లినప్పుడు కొద్ది నిమిషాల్లోనే తిరిగి రావాలి. అయిదు నిమిషాలకు మించి కాస్త ఆలస్యమైనా మీరు జరిమానా నుంచి తప్పించుకోలేరు. ఆలస్యాన్ని బట్టి జరిమానా విధిస్తారు.
రూ.100 నుంచి రూ.1000 వరకు జరిమానా
ఆలస్యాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ వంటి స్టేషన్లలో దశలవారీగా దీనిని అమలు చేయనున్నారు. తొలుత సికింద్రాబాద్ స్టేషన్లో బోయిగూడ వైపు ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
భారీ ఫైన్ తప్పదు..
నిమిషాల్లో వస్తాం కదా అని పార్కింగ్ స్థలంలో కాకుండా వేరేచోట పెడుతుంటారు. ఇది అందరికీ ఇబ్బందికరంగా మారింది. దీంతో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా రూ.100 నుంచి అరగంట వరకు ఆలస్యమైతే రూ.1000 వరకు వసూలు చేస్తారు.
ప్రత్యేక బూత్ ఏర్పాటు
రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో దశలవారీగా అమలు చేస్తారు. బోయిగూడ ద్వారా స్టేషన్ లోపలకు వచ్చే వాహనాలను గుర్తించేందుకు సికింద్రాబాద్ స్టేషన్లో సీసీ కెమెరాలతో పాటు ఓ ప్రత్యేక బూత్ ఏర్పాటు చేశారు. స్టేషన్కు వచ్చే ప్రతి వాహనం వివరాలను నమోదు చేస్తారు. వచ్చిన సమయం తెలుపుతూ రిసిప్ట్ ఇస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ రిసిప్ట్ను ప్రత్యేక బూత్లో ఇవ్వాలి.
అందుకే జరిమానాలు
ఐదు నిమిషాలు దాటితే ఫైన్ వేస్తారు. ఒకవేళ రసీదు పోతే రూ.500 వరకు కట్టాలి. పార్కింగ్ స్థలంలో కాకుండా స్టేషన్ పరిసరాల్లో వాహనాలను ఎక్కువ సేపు నిలిపి ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జరిమానాలు విధించాల్సి వస్తోందని చెబుతున్నారు.