హౌసింగ్ ప్రాజెక్టుల ఊతానికి రూ.10,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ కూడా మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో హౌసింగ్ ప్రాజెక్టులకు ఊతమిచ్చే ప్రకటన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుంచి శనివారం వచ్చింది. నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.10,000 కోట్ల ఫండ్తో ముందుకు వస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. సగంలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.
ప్రెస్ మీట్లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే
ఇప్పటికే ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ఉద్దీపన చర్యలను ఆగస్ట్ 23, 30 తేదీల్లో ప్రకటించామని, ఇప్పుడు ఎగుమతులు, టెక్స్ టైల్ తదితర రంగాలకు ఊతమిచ్చే చర్యలు ప్రకటిస్తున్నట్లు నిర్మల వెల్లడించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014 నుంచి పెరుగుతూ వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పెరుగుతాయన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందన్నారు.
బ్యాంకుల నుంచి క్రెడిట్ ఫ్లోను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీంతో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై జీఎస్టీ మండలి సమావేశం ముందు రోజు సెప్టెంబర్ 19న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో సమావేశమవుతామన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారత్ స్థానం మెరుగైందని, భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తామన్నారు. 2014లో భారత్ ర్యాంకు 142 అయితే 2018లో 77కి మెరుగు పడిందన్నారు. ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కొత్త పథకం ఎంఈఐఎస్ను ప్రవేశపెడుతున్నామన్నారు. ఎంఈఐఎస్ పథకం అమలుతో రూ. 50 వేల కోట్ల ఎగుమతులు పెరుగుతాయన్నారు.
ఎంఈఐఎస్ పథకాన్ని 2020, జనవరి 1వ తేదీన అమల్లోకి వస్తుందని, ఈ పథకం వల్ల టెక్స్టైల్ రంగాలతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పాత పథకం ఆర్వోడీటీఈఎస్ కూడా డిసెంబర్ వరకు కొనసాగుతుందన్నారు. పన్ను చెల్లింపుల్లో ఈ-అసెస్మెంట్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. మాంద్యం భయం నేపథ్యంలో కేంద్రం వరుసగా వివిధ రంగాలకు ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తోంది.