ఆ సమయంలో భారీ ఛార్జ్: ఓలా, ఉబెర్ క్యాబ్స్పై కొత్త నిబంధనలు!
దేశంలో రైడ్ షేర్ క్యాబ్ సర్వీసుల నుంచి కస్టమర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య భారీ ధరలు. ముఖ్యంగా డిమాండ్ ఉన్న సమయంలో భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాయి. ఇది కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరించేందుకు సిద్ధమవుతోందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో బేస్ ఛార్జీల కంటే మూడు రెట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలో డిమాండ్ సమయంలో బేస్ ఛార్జీల కంటే మూడు రెట్లు మాత్రమే వసూలు చేసే నిబంధనలను తీసుకు రావొచ్చునని తెలుస్తోంది.
ఇప్పటికైనా ఇలా చేయండి: నరేంద్రమోడీకి మన్మోహన్ 5 చిట్కాలు
ఉబెర్, ఓలా వంటి రైడ్ షేర్ క్యాబ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు సరైన నిబంధనలు లేవు. వీటిని నియంత్రించేందుకు కొన్ని చట్టాలు తీసుకు రావాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. ఈ అభ్యర్థనలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది. యాప్ ఆధారిత క్యాబ్ సేవల ఆపరేషన్స్ కోసం 2016లో చివరిసారి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు పూర్తి కసరత్తు చేస్తున్నారు.
2016లో ట్యాక్సీలకు 4 వేర్వేరు రకాల లైసెన్స్ మార్గదర్శకాలను ప్రతిపాదించారు. రాష్ట్ర ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్.. రైడ్ అగ్రిగేటర్లకు, రేడియే ట్యాక్సీ ఆపరేటర్లకు లైసెన్సులు జారీ చేయవచ్చునని ప్రతిపాదించింది. అలాగే, రైడ్ అగ్రిగేటర్ల గరిష్ట, కనిష్ట ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే అధికారం ఇచ్చాయి.
ఇటీవల వచ్చిన కొత్త మోటార్ వాహన చట్టం క్యాబ్ అగ్రిగేటర్లను డిజిటల్ ఇంటర్మీడియేటర్స్గా గుర్తించింది. రాష్ట్రాలు నిబంధనలు అమలు చేసే సమయంలో అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించనుంది. కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే క్యాబ్ అగ్రిగేటర్లకు ఇప్పటికే పలు నిబంధనలు జారీ చేశాయి. క్యాబ్ సేవలు ఉపయోగించుకునే కస్టమర్ల కనిష్ట, గరిష్ట ఛార్జీలను నిర్ణయించాయి.