మాంద్యం ఎఫెక్ట్: ప్రభుత్వరంగ కంపెనీల్లో పొదుపు చర్యలు షురూ!
భారత్ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... దేశంలో మందగమనం ఉంది అని అంగీకరించడానికి సందేహిస్తున్నా... ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రం పొదుపు చర్యలను మొదలు పెట్టాయి. దేశంలోనే అతి పెద్ద కాల్ మైనింగ్ కంపెనీ కాల్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఆర్థిక మందమైన పరిస్థితుల్లో కంపెనీ కాష్ ఫ్లోస్ ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల కు అందించే వివిధ రకాల భత్యాల కుదింపు లేదా చెల్లింపులను వాయిదా వేస్తున్నాయి. కాల్ ఇండియా లో ఏకంగా పనితీరు సరిగా లేని ఉన్నతాధికారుల వేతనంలో 25% వరకు కొత్త విధించాలని భావించినా... ప్రభుత్వ రంగ కంపెనీల్లో అది సాధ్యం కాదు కాబట్టి చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
కార్లు సరే... మరి వీటి సంగతేంటి మేడం?
ప్రభుత్వం నుంచి చెల్లింపులు బంద్...
కేద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలకు సర్కారు నుంచి రావాల్సిన నిధులు అందటం లేదట. పైగా... ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ఒక ఉచిత సలహా మాత్రం లభిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు కేద్ర ప్రభుత్వం రూ 20,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్న... నిధుల చెల్లింపు విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందట. ఇక చేసేదేమీ లేదు కాబట్టి... సంస్థ పరిధిలో ఉన్న మేరకు పొదుపు చర్యలను పాటిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఆగష్టు లో కోతలు మొదలు...
ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో ఆగష్టు నెల జీత భత్యాల్లో చాల మంది ఉద్యోగులకు కొత్త విధించ నున్నట్లు అంతర్గత సమాచారం అందింది. దీంతో ఉద్యోగుల్లో కలవరపాటు మొదలైందని అంటున్నారు. ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల లో అనుకొన్న టార్గెట్లను సాధించలేకపోయినందుకు నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ ఉద్యోగుల భార్యలను కుదిస్తున్నట్లు సమాచారం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు దేశ వ్యాప్తంగా 1,64,000 ఉద్యోగులు ఉన్నారు. సగటున ప్రతి నెల సుమారు రూ 800 కోట్లు వేతనాలుగా చెల్లిస్తుంది. ఢిల్లీ, ముంబై మినహా దేశవ్యాప్తం గా 20 సర్కిల్స్ లో సేవలు అందించే ఈ కంపెనీ గత పదేళ్లలో రూ 57,500 కోట్ల నష్టాలను చవిచూసింది. ఒక్క గతేడాదిలోనే దీనికి రూ 14,000 కోట్ల నష్టం వచ్చింది.
లీవ్ ఏంక్యాష్మెంట్ రద్దు...
భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీల్లో ఇప్పటికే ఉద్యోగుల లీవ్ ఏంక్యాష్మెంట్ రద్దు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలోకి మరిన్ని కంపెనీలు వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాధారణంగా 300 కి పైగా ఎర్న్డ్ లీవ్స్ ఉన్నప్పుడు, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, పదవి విరమణ చేసినప్పుడు లేదా రాజీనామా సమర్పించినప్పుడు లీవ్ ఏంక్యాష్మెంట్ సదుపాయాన్ని ఉయోగులు పొందుతారు. ఇది దాదాపు ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనంతో సమానంగా ఉంటుందని మానవ వనరుల విభాగం నిపుణులు చెబుతున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ఈ సదుపాయాన్ని చాలా కలం నుంచే నిలుపుదల చేసినట్లు సమాచారం.
దాచినా దాగునా ?
దేశం ఆర్థిక వృద్ధిలో దూసుకు పోతోందని, అత్యధిక వృద్ధి రేటును నమోదు చేస్తోందని ప్రచారం చేసుకొనేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొంత కాలం మాంద్యాన్నీ తొక్కిపెట్టగలదు కానీ ఎక్కువ కాలం దానిని దాచలేమని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రస్తుత పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలు అని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా... ప్రభుత్వం మేల్కొని, ఆర్థిక వ్యవస్థను, దేశాన్ని కాపాడాలని హితవు పలుకుతున్నారు. లేదంటే, పరిస్థితులు చేయి దాటిపోయేందుకు ఎంతో కాలం పట్టదని వారు హెచ్చరిస్తున్నారు.