అక్టోబర్లో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. భారత్లోను ఈ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి వడ్డీ రేట్లలో కోత విధించవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే గత నాలుగుసార్లు 110 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈసారి మరింత తగ్గించవచ్చునని అంటున్నారు.
అక్టోబర్ ఆర్బీఐ నాలుగో ద్వైమాసిక సమీక్ష ఉంటుంది. ఈ సమీక్షలో వడ్డీ రేట్లను గతంలో కంటే ఎక్కువే తగ్గించవచ్చునని భావిస్తున్నారు. అక్టోబర్ నెలలో 40 బేసిస్ పాయింట్ల వరకు ఆర్బీఐ వడ్డీ కోత విధించవచ్చునని నోమురా పేర్కొంది. పెట్టుబడులను ప్రోత్సహించేలా రుణభారాన్ని తగ్గించేందుకు రేట్ కట్ అవసరమని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. వచ్చే నెలలో 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చునని అంచనా వేసింది.
SBI క్రెడిట్ కార్డు బిల్లును ఏటీఎం ద్వారా ఎలా చెల్లించాలి?
2019-20 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయానికి మరో 75 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చునని కొటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (IIP), కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా నేపథ్యంలో రెపో రేటు తగ్గించవచ్చునని ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్భణం, పారిశ్రామిక వృద్ధిని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా ఉంది.