రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రసాదం
హైదరాబాద్: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈ సంవత్సరం అత్యధిక ధర పలికింది. గత కొన్నేళ్లుగా ఏటికేడు ఈ గణేషుడి ధర లక్షలకు లక్షలు పెరుగుతోంది. ఈ ఏడాది సైతం రూ.17.60 లక్షలు పలికింది. కొలను రామిరెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదాన్ని గత ఏడాది కంటే రూ.1 లక్ష ఎక్కువకు కొనుగోలు చేశారు. వేలం సందర్భంగా బాలాపూర్ లడ్డూ రూ.వెయ్యి నూటా పదహార్లతో ప్రారంభమైంది. వేలంలో నలుగురుకి పైగా నాన్ లోకల్స్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు భక్తులు పాల్గొన్నారు. 19 మంది వరకు ఈ వేలం పాటలో పాల్గొన్నారు.
25 ఏళ్లలో రూ.16 లక్షలు దాటిన లడ్డూ ధర
గత 25 ఏళ్లుగా ఈ లడ్డూను వేలం వేస్తున్నారు. 1994లో రూ.450 పలికిన లడ్డూ, గత ఏడాది (2017) రూ.15.60 లక్షలు పలికింది. 2018లో అంతకు ముందు ఏడాది కంటే లక్ష ఎక్కువ పలికింది. గత ఏడాది ఆర్యవైశ్య సంఘం తరఫున తేనేటిపల్లి శ్రీనివాస్ గుప్తా ఈ లడ్డూ ప్రసాదాన్ని రూ.16.60 లక్షలకు కొనుగోలు చేశారు.
మొదట స్థానికులకే అవకాశం.. ఆ తర్వాత స్థానికేతరులకూ..
బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డూ వేలం పాట మాత్రం 1994లో రూ.450తో ప్రారంభమైంది. ఈ లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం. నమ్మకమే కాదు.. దీనిని వేళంలో దక్కించుకున్న వారు అనుభవపూర్వకంగా చెప్పినమాటలు. లడ్డూ వేలంపాట మొదలైన 17 సంవత్సరాలు స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు అవకాశమిస్తున్నారు.
25 ఏళ్లుగా ఎవరెవరు ఎంతకు దక్కించుకున్నారంటే..
1994లో బాలాపూర్ గణేషుడి లడ్డూను కొలను మోహన్ రెడ్డి రూ.450కి కొనుగోలు చేశారు. 1994 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎంతకు కొనుగోలు చేశారంటే...
1994 కొలను మోహన్ రెడ్డి రూ.450
1995 కొలను మోహన్ రెడ్డి రూ.4500
1996 కొలను కృష్ణా రెడ్డి రూ.18,000
1997 కొలను కృష్ణారెడ్డి రూ.28,000
1998 కొలను మోహన్ రెడ్డి రూ.51,000
1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65,000
2000 కళ్లెం అంజిరెడ్డి రూ.66,000
2001 జి రఘునందన్ రెడ్డి రూ.85,000
2002 కందాడ మాధవ రెడ్డి రూ.1.05 లక్షలు
2003 చిగురింత బాల్రెడ్డి రూ.1.55 లక్షలు
2004 కొలను మోహన్ రెడ్డి రూ.2.01 లక్షలు
2005 ఇబ్రామ్ శేఖర్ రూ.2.08 లక్షలు
2006 చిగురింత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలు
2007 జి రఘునందాచారి రూ.4.15 లక్షలు
2008 కొలను మోహన్ రెడ్డి రూ.5.07 లక్షలు
2009 సరిత రూ.5.10 లక్షలు
2010 శ్రీధర్ బాబు రూ.5.30 లక్షలు
2011 కొలను కుటుంబం రూ.5.45 లక్షలు
2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7.50 లక్షలు
2013 తీగల కృష్ణా రెడ్డి రూ.7.26 లక్షలు
2014 జైహింద్ రెడ్డి రూ.10 లక్షలు
2015 కళ్లెం మదన్మోహన్రెడ్డి రూ.10.32 లక్షలు
2016 కందాడి స్కైలాబ్ రెడ్డి రూ.14.65 లక్షలు
2017 నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలు
2018 తేనేటిపల్లి శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలు
గ్రామాభివృద్ధికి లడ్డూ నిధులు
బాలాపూర్ లడ్డూ ద్వారా వచ్చిన డబ్బును మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి మరింత ఖర్చు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.