విప్రో బైబ్యాక్: రూ.7,300 కోట్ల షేర్లను విక్రయించిన అజిమ్ ప్రేమ్ జీ
విప్రో లిమిటెడ్ ప్రమోటర్ గ్రూప్, అజిమ్ ప్రేమ్ జీ బిలియన్ డాలర్ల విలువ కలిగిన (రూ.7,300 కోట్లు) షేర్లను బ్యాబ్యాక్ ప్రోగ్రాంలో భాగంగా విక్రయించారు. ప్రేమ్ జీ తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం కూడా ఇక సేవా కార్యక్రమాలకే ఎక్కువ సమయం, నిధులు కేటాయిస్తానని తెలిపారు.
ఈ మేరకు బుధవారం విప్రో బైబ్యాక్ షేర్ల పైన ప్రకటన చేసింది. కంపెనీ ఫౌండర్ - చైర్మన్, అతని ఆధీనంలోని సంస్థలకు చెందిన 224.6 మిలియన్ షేర్లను ఇటీవల బైబ్యాక్ ప్రోగ్రాంలో భాగంగా విక్రయించినట్లు తెలిపింది. ఈక్విటీ వాటాలో దీని వ్యాల్యూ 3.96 శాతమని చెప్పింది.
అజిమ్ ప్రేమ్ జీ అతనికి సంపాదనలోని 67 శాతం మొత్తాన్ని దాతృత్వ సేవా కార్యక్రమాల కోసం అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్కు ఇచ్చారు. వీటి విలువ రూ.1.45 లక్షల కోట్లు లేదా 21 బిలియన్ డాలర్లు. అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పని చేస్తోంది. ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులతో కలిసి పని చేస్తోంది.
ఈ డబ్బును అంతటినీ ప్రేమ్ జీ దాతృత్వ కార్యక్రమాల కోసం వినియోగించేందుకు కట్టుబడి ఉన్నారని అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ చీఫ్ ఎండోమెంట్ ఆఫీసర్ కేఆర్ లక్ష్మీనారాయణ అన్నారు.
SBI క్రెడిట్ కార్డు బిల్లును ఏటీఎం ద్వారా ఎలా చెల్లించాలి?
బైబ్యాక్ ద్వారా వచ్చిన మొత్తం గురించి ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక విప్రో రిప్రజెంటేటివ్ను ప్రశ్నించగా... బైబ్యాక్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రమోటర్స్ దేనికోసం ఉపయోగించుకుంటారనే దానిపై కంపెనీ స్పందించదని తెలిపారు.
ఫౌండర్ - చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ గతంలో వెల్లడించినట్లుగా 67 శాతం అతని ఆస్తులు దాతృత్వ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని, అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. టెక్ దిగ్గజం విప్రోలో అజిమ్ ప్రేమ్ జీ కుటుంబానికి, వారి సంస్థలకు 73.83 శాతం వాటాలు ఉన్నాయి.
అజిమ్ ప్రేమ్ జీ దాతృత్వ కార్యకలాపాలకు కొత్త మార్గం చూపారని, ఇది ఆనందించదగ్గ విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఎక్కువ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్న వారు ప్రేమ్ జీ అని, పోషకాహారం, గృహహింస, ఇండిపెండెంట్ మీడియా, బాలికా సాధికారత, విద్య వంటి అనేక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారని వెంచర్ ఫిలాంథ్రఫీ ఫండ్ దాస్రా కో-ఫౌండర్ దేవాల్ సంఘవి అన్నారు.
భారత్ మిడిల్ ఇన్కం కంట్రీ నుంచి అభివృద్ధి చెందుతోందని, చాలామంది ఇంటర్నేషనల్ డోనర్స్ ముందుకు వస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్లో కొన్ని ముఖ్య అవసరాల పరిష్కారం కోసం వందలాదిమంది అజిమ్ ప్రేమ్ జీలు అవసరమని చెబుతున్నారు.