ఆటో సేల్స్, జీఎస్టీ, జీడీపీ తగ్గుదలపై నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే
చెన్నై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు (10 సెప్టెంబర్ 2019) మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధిని మెరుగుపర్చడం- 100 రోజుల పాలనలో సాహసోపేత కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాత్మక చర్యలు అనే అంశంపై ఆమె మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ మార్కెట్ ప్రభావంతో దేశంలో ఆటో సేల్స్ భారీగా పడిపోయాయి. క్వార్టర్ 1 జీడీపీ 5 శాతానికి పరిమితమైంది. ఆగస్ట్ నెలలో పాసింజర్ వెహికిల్స్ సేల్స్ భారీగా తగ్గిపోయినట్లు SIAM నివేదిక వెల్లడించింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.50 కంటే పైగా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు.
నరేంద్ర మోడీ వంద రోజుల పాలనపై నిర్మలా సీతారామన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఆటో ఇండస్ట్రీ తీవ్ర మాంద్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీపై ఇండస్ట్రీ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటామని నిర్మల చెప్పారు.
ఇటీవల క్వార్టర్ 1లో జీడీపీ రేటు 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందించారు. వృద్ధి ప్రక్రియలో భాగంగానే జీడీపీ తగ్గుదలను చూడాలని అభిప్రాయపడ్డారు. జీడీపీ ఎలా ఉందనే అంశాన్ని పక్కన పెడితే, వచ్చే క్వార్టర్లో జీడీపీని ఎలా పెంపొందించాలనే అంశంపై దృష్టి సారించామన్నారు.
సాధ్యమైనంత వరకు ఇన్ఫ్రా ఖర్చులను ఫ్రంట్ లోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆటో పరిశ్రమను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆటో రంగాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఆటో ఇండస్ట్రీకి జీఎస్టీని తగ్గిస్తారా అని ప్రశ్నించగా.. ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సెల్ తేలుస్తుందని చెప్పారు. జీఎస్టీ రెవెన్యూ తగ్గుదలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.