అధిక ఫైన్ లేకుంటే భయపడతారా, ప్రాణాలు అవసరం లేదా: గడ్కరీ
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించడం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థ చట్టాన్ని ఉల్లంఘించేవారి మధ్య వివక్షను చూపించదని చెప్పారు. ఎవరైనా చట్టానికి లోబడి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించని పక్షంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అధిక జరిమానా సరైనదేనని అభిప్రాయపడ్డారు.
కొత్త మోటార్ వాహన చట్టం భారీ జరిమానాలను సూచిస్తోంది. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. బైక్స్ నుంచి ట్రక్కుల వరకు వేలాది రూపాయల జరిమానాలు చెల్లించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటివి ప్రమాదాలకు కారణమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
'ఒకరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తే చలాన్లకు భయపడాల్సిన పని లేదు. నిబంధనలు పాటిస్తే భయపడటం ఎందుకు? ఇలాంటి కఠిన నిబంధనల వల్ల భారతదేశ రోడ్లు కూడా విదేశాల్లోని సురక్షిత రహదారుల వలె సురక్షితంగా మారుతాయని ప్రజలు సంతోషించాలి. మనిషి జీవితం విలువైనది కాదా (ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతుండటాన్ని ఉద్దేశించి)' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను చాలా ఈజీగా తీసుకుంటున్నారని, దీంతో ప్రమాదాలకు కారణం అవుతోందని, కాబట్టి నిబంధనలు కఠినతరం చేసినట్లు గడ్కరీ చెప్పారు. తక్కువ ఫైన్స్ ఉన్నందువల్ల చట్టం పట్ల భయం, గౌరవం లేకుండా పోయాయాన్నారు.
'ఇది చాలా సున్నతమైన సమస్య. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అడగండి. 65 శాతం ప్రమాద బాధితులు 18-35 ఏళ్ల మధ్య వయస్సుగలవారే. వారి కుటుంబాలను అడగండి ఈ చలాన్ల గురించి. నేను కూడా ప్రమాద బాధితుడినే. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్, టీడీఆర్ఎస్ వంటి అన్ని పార్టీలు ఆలోచించాల్సిన విషయం' అన్నారు.
కొత్త వాహన చట్టం ఎవరి పట్ల వివక్ష చూపించదన్నారు. జర్నలిస్ట్ అయినా, బ్యూరోక్రాట్ అయినా జరిమానా చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రులు, వంటి ప్రముఖులు కూడా చలాన్లు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఎలక్ట్రానిక్ ఫామ్లోని డిజిలాకర్, ఎంపరివాహన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను ట్రాఫిక్ పోలీసులకు చూపించవచ్చునన్నారు.