కార్డు లేకుండానే: స్కాన్ చేసి ATM నుంచి డబ్బు విత్డ్రా చేయవచ్చు
కార్డ్-లెస్ క్యాష్ విత్డ్రాల్స్ దిశగా బ్యాంకులు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో ద్వారా ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ఇప్పుడు మరో ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా క్యాష్-లెస్ విత్ డ్రాల్స్ దిశగా అడుగు వేస్తోంది. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) కోడ్ ఆధారంగా నగదు ఉపసంహరణకు వీలు కల్పించే ఏటీఎంలను శనివారం ప్రారంభిస్తున్నట్లు BOI వెల్లడించింది.
ఈ హోటల్లో ఆర్టికల్ 370 ఆఫర్: ఏపీ-తెలంగాణ బిర్యానీ, గోంగూర ప్రత్యేకం
ముంబై, చెన్నై, ఢిల్లీల్లో ప్రారంభం...
ముంబై, చెన్నై, ఢిల్లీలలో వీటిని ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ కొత్త సేవల కోసం ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో అన్ని ఏటీఎం కేంద్రాలకు ఈ సదుపాయాలను విస్తరింపజేస్తామని పేర్కొంది. ఈ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ సిస్టంను ఇతర బ్యాంకుల ఏటీఎంలకు కూడా విస్తరించవచ్చునని చెబుతున్నారు.
క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేసి..
ఏటీఎం తెర పైన కనిపించే క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేయడం ద్వారా నగదును విత్ డ్రా చేయవచ్చునని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. డెబిట్ కార్డు ద్వారా అయితే ఓసారి రూ.10,000 చేయవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఒక్కోసారి రూ.2,000 మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
కార్డు, పిన్ అవసరం లేదు..
కస్టమర్లు ఏటీఎం సెంటర్కు వెళ్లి తమ మొబైల్ ఫోన్లో గల బ్యాంకు UPI ప్లాట్ ఫామ్ను వినియోగించి ఏటీఎం స్క్రీన్ పైన గల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదును తీసుకోవచ్చునని, క్యూఆర్ కోడ్తో ఏటీఎం లావాదేవీల వల్ల భద్రత మరింతగా పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించినప్పుడు కార్డు, పిన్ అవసరం ఉండదని తెలిపారు.