ఆదిత్య బిర్లా కాపిటల్ లోకి రూ 1,300 కోట్ల పెట్టుబడి
కుమార మంగళం బిర్లా కు చెందిన .... ఆదిత్య బిర్లా కాపిటల్ లిమిటెడ్ (అబీసీఎల్) లోకి భారీ పెట్టుబడి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అడ్వెంట్ ఈ మేరకు ఆసక్తి చూపుతోంది. సుమారు రూ 1,200 కోట్ల నుంచి రూ 1,300 కోట్ల మేరకు పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనిపై కుమార మంగళం బిర్లా తో ముమ్మర చర్చలు జరిపింది. ఈ పెట్టుబడితో ఆదిత్య బిర్లా కాపిటల్ లో 6-7% వాటా ను అడ్వెంట్ ఆశిస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. ఆదిత్య బిర్లా కాపిటల్ ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ ఐన కంపెనీ. ఇది ఆర్థిక సేవలను అందించే హోల్డింగ్ కంపెనీ.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా?: దరఖాస్తు లేకుండానే పాన్కార్డ్!
రూ 3,500 కోట్ల సమీకరణ...
ఆదిత్య బిర్లా కాపిటల్ మొత్తంగా రూ 3,500 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోంది. ఇందుకోసం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేసెమెంట్ (క్యూఐపీ) సహా వివిధ మార్గాలను ఎంపిక చేసుకోంది. ఇందులో భాగంగా ఈ నెల 5న కంపెనీ బోర్డు మీటింగును నిర్వహించనుంది. ఈ మీటింగ్లో అమెరికా కంపెనీ అడ్వెంట్ పెట్టుబడి అంశాన్ని పరిశీలించి అనుమతించే అవకాశం ఉంది. ఈ డీల్ పూర్తయితే, ఆదిత్య బిర్లా కాపిటల్ లిమిటెడ్ లో ప్రోమోటర్ల తర్వాత అడ్వెంట్ కంపెనేయే అతిపెద్ద ష్రెహోల్డర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
అజీమ్ ప్రేమజీ పెట్టుబడులు...
కుమార మంగళం బిర్లా కంపెనీ ఐన ఆదిత్య బిర్లా కాపిటల్ లో విప్రో అధిపతి అజీమ్ ప్రేమజీ కూడా పెట్టుబడి పెట్టారు. 2017 జులై లో అయన తన పెట్టుబడి సంస్థ అయిన ప్రేమజీ ఇన్వెస్ట్ ద్వారా రూ 704 కోట్ల పెట్టుబడి పెట్టారు. దీంతో ఆయనకు ఆదిత్య బిర్లా కాపిటల్ లో 2.2% వాటా లభించింది. అప్పుడు ఆదిత్య బిర్లా కాపిటల్ విలువను రూ 32,000 కోట్లుగా లెక్క కట్టారు. 2017 లోనే ఆర్థిక సేవలను విభజించి ఆదిత్య బిర్లా కాపిటల్ గా ఏర్పాటు చేసారు. అదే సమయం లో ఆదిత్య బిర్లా నువో అనే సంస్థను గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో కలిపేశారు.
65% పతనమైన షేర్లు...
ఆర్థిక సేవలను అందించే ఆదిత్య బిర్లా కాపిటల్ లిమిటెడ్.... స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 65% విలువను కోల్పోయింది. ఈ కంపెనీ షేర్లు ఆ మేరకు పతనమయ్యాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ 19,309 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత డీల్ ప్రకారం అడ్వెంట్ కంపెనీకి ప్రస్తుత మార్కెట్ రేటు కంటే కేవలం 5-6% ప్రీమియం కె షేర్ల ను కేటాయించే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అడ్వెంట్ కు బోర్డు సీటు...
ఒక రకంగా చెప్పాలంటే అడ్వెంట్ కు కారు చౌకగా ఆదిత్య బిర్లా కాపిటల్ షేర్లు లభిస్తున్నట్లే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేవలం 6-7% వాటా అయినప్పటికీ అడ్వెంట్ బోర్డు సీట్ ను అడిగే ఛాన్స్ ఉందని... ఇందులో ఆదిత్య బిర్లా కాపిటల్ యాజమాన్యం సరేనందని సమాచారం. కాగా... అడ్వెంట్ కంపెనీ ఇప్పటి వరకు భారత్ లో రూ 6,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా ఆర్థిక సేవలు అందించే పెద్ద కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేస్తూ దూసుకు పోతోంది.