ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ, ఆ తర్వాత భారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్లో విలీనం అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. దీనికి రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికను సీఎం జగన్కు ఇవ్వనుంది. ఒకే దశలో సంస్థ విలీనం సాధ్యాసాద్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. తొలివిడతలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ATM కార్డు తిరిగిచ్చే టైం! SBI కస్టమర్స్ తెలుసుకోవాలి
1958లో ప్రారంభమైన ప్రస్థానం
ఏపీఎస్ఆర్టీసీ ప్రస్థానం 1958లో ప్రారంభమైంది. ప్రస్తుతం 128 డిపోలు, 4 యూనిట్లలో 12 వేల బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. 52 వేలమంది సిబ్బంది ఉన్నారు. కాగా, విలీనంపై కమిటీ ఐదు రకాల విధానాలను సిపార్సు చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు నష్టాలు వస్తున్నందున ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడంపై కూడా కమిటీ నివేదికలో పొందుపరిచిందని తెలుస్తోంది. మెరుగైన నిర్వహణ విధానాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది.
రూ.7వేల కోట్ల వరకు అవసరం...
ఆర్టీసీ కష్టాల నుంచి గట్టెక్కాలంటే దాదాపు రూ.7వేల కోట్లు అవసరమని కొద్ది రోజుల క్రితం సంబంధిత మంత్రి పేర్ని నాని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు చెందిన రూ.3వేల కోట్ల నిధులను నేరుగా వాడిందని, ఉద్యోగులకు పెంచిన వేతన సవరణ బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని చెప్పారు. అయితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విలీనం చేయడమే మంచి మార్గమని భావిస్తున్నారు.
బడ్జెట్లో డీజిల్పై సుంకాల కారణంగా...
ఇటీవల బడ్జెట్లో డీజిల్ పైన సుంకాల పెంపు ఫలితంగా ఆర్టీసి పైన ఏడాదికి రూ.73 కోట్ల అదనపు భారం పడనుంది. ట్యాక్స్ పెంపు అమలులోకి వచ్చాక డీజిల్ కొనుగోలు కోసం ఆర్టీసి రోజుకు రూ.2 లక్షలు అదనంగా వెచ్చిస్తోంది. ఆర్టీసీ రోజుకు సగటున 12వేల బస్సులను 43 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతోంది. రోజు 83వేల లీటర్ల చొప్పున నెలకు దాదాపు రూ.2.50 కోట్లు, ఏడాదికి రూ.30 కోట్ల లీటర్ల డీజిల్ను వినియోగిస్తోంది.
ఆర్టీసీపై భారం...
సాధారణంగా డీజిల్ పైన లీటరుకు ఒక రూపాయి పెరిగితే ఆర్టీసి పైన ఏడాదికి రూ.30 కోట్ల భారం పడుతుంది. బడ్జెట్ అనంతరం మూలధరపై పన్నులు కలిపితే మొత్తం రూ.72.90 కోట్ల భారం పడుతుంది.
ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ
ఆర్టీసీ బస్సును ఒక కిలోమీటరు నడిపేందుకు రూ.44.58 ఖర్చు అవుతోంది. ఆధాయం మాత్రం రూ.6కు పైగా తగ్గి రూ.38కి కాస్త పైన ఉంది. ఎక్కువగా డీజిల్ పెరుగుదల కారణంగా భారం పడుతోంది. 2015-16లో డీజిల్ కోసం రూ.1456 కోట్లు ఖర్చు చేయగా, 2018-19లో ఈ ఖర్చు రూ.2074 కోట్లకు పైగా ఉంది. నాలుగేళ్లలో సంస్థపై దాదాపు రూ.650 కోట్ల అదనపు భారం పడుతోంది. ధరల పెరుగుదల తర్వాత మరింత భారం అయింది.