ఒక్కరోజులో 49 లక్షలు.. ఐటి రిటర్న్స్ ఫైలింగ్లో ప్రపంచ రికార్డ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్యలో మంచి వృద్ధి చోటు చేసుకుందని ఆదాయపన్ను శాఖ సోమవారం నాడు వెల్లడించింది. అదే సమయంలో ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా ఒక విధంగా ప్రపంచ రికార్డ్ సృష్టించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. జూలై 31వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు ఉండగా, కేంద్ర ప్రభుత్వం దానిని ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించింది.
అలర్ట్గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!
5.65 కోట్ల రిటర్న్స్ దాఖలు..
గత నెల 31వ తేదీ ముగిసేసరికి దాఖలైన ఐటీ రిటర్న్స్ మొత్తం 5.65 కోట్ల దాఖలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 5.42 కోట్లతో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి నమోదయింది. మరో రికార్డ్ కూడా ఉంది. ఆగస్ట్ 31వ తేదీన ఒక్కరోజే 49,29,121 మంది ఆన్లైన్ ద్వారా రిటర్న్స్ దాఖలు చేశారు. ఆగస్ట్ 27 నుంచి 31 నాటికి 1,47,82,095 రిటర్న్స్ దాఖలయ్యాయి.
3.61 కోట్ల రిటర్న్స్ వెరిఫికేషన్ పూర్తి...
దాఖలైన 5.65 కోట్ల రిటర్న్స్లలో ఇప్పటి వరకు 3.61 కోట్ల రిటర్న్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఆగస్ట్ 31వ తేదీన అత్యంత ఎక్కువగా ఫైల్ చేసిన సమయంలో సెకండుకు 196 ఐటీ రిటర్న్స్, నిమిషానికి 7447 ఐటి రిటర్న్స్ ఫైల్ అయినట్లు తెలిపింది. అలాగే గంటకు 3,87,571 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు తెలిపింది. బిజీగా ఉన్న సమయంలో 2205 దాడుల ప్రయత్నాలను గుర్తించి అడ్డుకున్నట్లు తెలిపింది.
ఈ-ఫైలింగ్ రిటర్న్స్కు స్పందన..
ప్రీ-ఫైల్డ్ ఫామ్స్ అందుబాటులో ఉండటంపై మంచి స్పందన వచ్చింది. 27 ఆగస్ట్ నుంచి ఈ-ఫైలింగ్ రిటర్న్స్ గత ఏడాదితో పోలిస్తే 32 నుంచి 63 శాతానికి పెరిగినట్లు తెలిపింది. చివరి ఐదు రోజుల్లో 14.7 మిలియన్ ఈ-ఫైలింగ్స్ జరిగినట్లు చెప్పింది. అంతకుముందు ఏడాది కంటే 42 శాతం అధికమని పేర్కొంది.