బ్యాంకుల విలీనం : కస్టమర్ల పరిస్థితి ఏమిటి?
ఊహించని స్థాయిలో కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఖాతాదారుల్లో కాస్త కంగారు మొదలైంది. విలీనం అవుతున్న బ్యాంకుల్లో ఖాతా ఉన్న తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ మధ్యకాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో అనుబంధ బ్యాంకులు విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే విలీనం అయ్యే సందర్బంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కాబట్టి తమ బ్యాంకింగ్ లావాదేవీలను సక్రమంగానే జరుపుకోవచ్చు. ఏవైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు మాత్రం వాటి గురించి ఖాతాదారులకు తెలియజేస్తారు. అప్పుడు బ్యాంకుకు వెళ్లడం ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా తగిన సమాచారం ఇస్తే సరిపోతుంది. కాగా బ్యాంకుల విలీనం ద్వారా మన ఖాతాలు, డెబిట్ కార్డులు, ఈఎంఐ లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం...
బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలు పోతాయా?
డిపాజిట్లు, రుణాలపై వడ్డీరేట్లు
ఈ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. బ్యాంకులు సాధారణంగా నిధుల వ్యయ ఆధారితంగా రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. భారత రిజర్వ్ బ్యాంక్ రేపో మార్చిన ప్రతిసారి బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. కాబట్టి అప్పటిదాకా ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లు కొనసాగుతాయి. అయితే కొత్తగా రుణాలు తీసుకునే వారు లేదా కొత్తగా డిపాజిట్ చేయాలనుకునే వారికి చెల్లించాల్సిన వడ్డీ రేటు ను మాత్రం విలీన బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇదేవిధంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ము పై చెల్లించే వడ్డీ రేటు మారవచ్చు.
డెబిట్ కార్డు
ఇప్పుడు వినియోగిస్తున్న డెబిట్ కార్డునే వాడుకోవచ్చు. చెక్కు బుక్కులను కూడా వాడుకోవచ్చు. కొంతకాలం తర్వాత వీటిని బ్యాంకులు మార్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అవసరమైతే పాత చెక్కుబుక్కును, డెబిట్ కార్డును ఇచ్చి కొత్తవాటిని తీసుకోవచ్చు.
శాఖలు
అవసరాన్ని బట్టి బ్యాంకులు ప్రస్తుతమున్న శాఖలను కొనసాగించవచ్చు లేదా కొన్నింటిని మూసివేయవచ్చు. కొంతకాలం తర్వాత బ్యాంకుల ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ లో మార్పులు జరగవచ్చు. ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించే వారు ఈ విషయంపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది.
ఖాతా సంఖ్య
బ్యాంకు ఖాతా సంఖ్య ఇప్పటికిప్పుడు మారిపోదు. బ్యాంకుల విలీనానికి కొంత సమయం పడుతుంది. కొంతకాలం తర్వాత అవసరం అనుకుంటే ఖాతా సంఖ్యలను మార్చవచ్చు. ఒకవేళ మార్చితే కొత్త ఖాతా సంఖ్యతో పాటు కొత్త కస్టమర్ ఐడీ ని ఇస్తారు. ఒకవేళ ఖాతా నెంబర్ మారినా లేదా ఐ ఎఫ్ ఎస్ సి నంబర్ మారినా కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ నంబర్లను మీరు ఎక్కడైతే ఇచ్చి అప్ డేట్ చేయాలి. ఉదాహరణకు ఆదాయ పన్ను శాఖవద్ద, మీకు సొమ్మును రావాల్సి ఉన్నచోట అప్ డేట్ చేయాలి.