ఐటీ రిటర్న్స్ గడువు మరోసారి పొడిగించారా!?: CBDT ఏం చెప్పిందంటే
న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు పెంచుతారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొట్టిపారేసింది. ఐటీఆర్ ఫైలింగ్ తేదీని ఇదివరకు పొడిగించారు. గత నెలలో చివర్లో ఆగస్ట్ 31వ తేదీకి పొడిగించారు. ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై CBDT శుక్రవారం నాడు స్పష్టతనిచ్చింది. గడువు పొడిగించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇది ఫేక్ అని వెల్లడించింది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా.. ఇవి తెలుసుకోండి
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని పొడిగించలేదు
'ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సంబంధిత శాఖ ఆర్డర్స్ జారీ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పొడిగిస్తున్నట్లుగా ఆర్డర్ జారీ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఆ ఆర్డర్ నిజమైనది కాదు. కాబట్టి ట్యాక్స్ పేయర్స్ 31 ఆగస్ట్ 2019లోగా తమ ఐటీ రిటర్న్స్ పైల్ చేయాలి.' అని CBDT ట్వీట్ చేసింది. ఆ ఆర్డర్ ఫేక్ అని స్పష్టం చేసింది.
జూలై 31 నుంచి నెల రోజులు పొడిగింపు
సాధారణంగా ఐటీ రిటర్న్స్ సమర్పించేందుకు చివరి తేదీ జూలై 31. అయితే రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని, గడువు తేదీని పెంచాలని వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీని జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 31వ తేదీకి పొడిగించారు. కానీ మరోసారి పొడిగించే పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం సాగుతోంది.
ఆగస్ట్ 31లోపు చెల్లించకుంటే...
ఆగస్ట్ 31వ తేదీలోపు ఐటీ రిటైర్న్స్ ఫైల్ చేయని పక్షంలో 2019-20 అసెస్మెంట్ ఇయర్లో ఫైల్ చేయవచ్చు. అంటే మార్చి 31వ తేదీ వరకు ఫైల్ చేయవచ్చు. అయితే ఆలస్యానికి గాను జరిమానా చెల్లించవలసి ఉంటుంది. డిసెంబర్ 31 లోపు పైల్ చేస్తే రూ.5,000 పెనాల్టీ ఉంటుంది. 2019-20 అసెస్మెంట్ ఇయర్ 2019-20లో జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఈ పెనాల్టీ రూ.5 లక్షలకు మించి ఆదాయం కలిగిన ఇండివిడ్యువల్స్కు వర్తిస్తుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండి జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఫైల్ చేస్తే పెనాల్టీ రూ.1,000. ఏదైనా పేమెంట్ డ్యూస్ ఉంటే 1 శాతం వడ్డీ ఉంటుంది.