రికార్డ్ స్థాయికి లోన్ రికవరీలు, త్వరలో 2 కీలక నిర్ణయాలు: నిర్మల
న్యూఢిల్లీ: బ్యాంకుల లోన్ రికవరీలు రికార్డ్ హైకి చేరుకున్నాయనికేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. లోన్ రికవరీ 2018లో రూ.77,000 కోట్లుగా ఉండగా, అది రూ.1,71,676 కోట్లకు పెరిగిందని చెప్పారు. గ్రాస్ ఎన్పీఏలు 7.9 లక్షల కోట్లకు తగ్గినట్లు తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు అందకుముందు రూ.8.65 క్షల కోట్లుగా ఉన్నాయని, ఇప్పుడు భారీగా తగ్గాయన్నారు. ఈ రోజు ప్రకటిస్తున్న అంశాలు మార్కెట్లో రుణాలను పెంచే లక్ష్యంతో ఉంటాయని బ్యాంకుల విలీనాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో OBC, UBI విలీనం: నిర్మల సీతారామన్
భారీ రుణాలు, మొండిబకాయిలపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. NBFCలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తామన్నారు. పెండింగులో ఉన్న జీఎస్టీ రీఫండ్స్ను రానున్న ముప్పై రోజుల్లో క్లియర్ చేస్తామని, భవిష్యత్తులో అరవై రోజుల్లో రీఫండ్స్ను విడుదల చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్రం త్వరలో రెండు కీలక నిర్ణయాలు తీసుకోనుందన్నారు.
నిర్మలా సీతారామన్ శుక్రవారం వివిధ బ్యాంకుల విలీనంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలను చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకును విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడనున్నట్లు తెలిపారు.
కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకును కలిపి అయిదే అతిపెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గుతుంది.