శుభవార్త! ఇప్పుడున్న ధర కంటే తక్కువకే త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు!!
న్యూఢిల్లీ: రానున్న మూడు నాలుగేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్ బుధవారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తోన్న కంపెనీలు.. వీటికి అధిక ఖర్చు అవుతాయని చెబుతున్నాయి. ఈ భారం కస్టమర్లపై కూడా పడనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి...
అయితే సమీప భవిష్యత్తులోనే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని అమితాబ్ కాంత్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కార్ల ధరలకే ఈవీలు కూడా లభిస్తాయని తెలిపారు. దీంతో కస్టమర్లపై కూడా ఖరీదు భారం తగ్గనుంది. బ్యాటరీ ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం మన దేశంలో కార్లు ఉన్న ప్రతి వెయ్యి మందిలో 28 మందికి కార్లు ఉన్నాయన్నారు. అమెరికాలో అయితే 980, యూరప్లో 850 ఉన్నట్లు చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైపే అందరూ చూస్తారన్నారు.

అలా రేట్లు తగ్గుతాయి...
బ్యాటరీ ధర కిలో వాట్ హవర్ (kWh)కు 276 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గిపోతుందని, తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం సాధ్యమేనని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్ల ధరలకే వీటి ధరలు తగ్గడానికి మూడు నాలుగేళ్లు చాలునని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాల కోసం డీజిల్, పెట్రోల్ వాహనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటుందనే వాదనల నేపథ్యంలో ఆటో రంగం భారీగా సంక్షోభాన్ని ఎదుర్కొంది. 2019లో ఆటో సేల్స్ సరాసరిగా దాదాపు 31 శాతం పడిపోయాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఐదు రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. దీంతో కాస్త కోలుకుంటోంది.

పెద్ద మొత్తంలో నిధులు మిగులుబాటు
ఎలక్ట్రిక్ వాహనాల వల్ల క్రూడాయిల్ వినియోగం తగ్గుతుందని, దాదాపు 111 బిలియన్ డాలర్ల దిగుమతుల భారం తగ్గుతుందని అమితాబ్ కాంత్ అన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విధానాలు రూపొందించినట్లు తెలిపారు. టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్, కార్లు, బస్సులు.. ఇలా అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తే క్రూడాయిల్ వినియోగం తగ్గి ఆ మేరకు పెద్ద మొత్తంలో నిధులు మిగులుతాయన్నారు.


Click it and Unblock the Notifications