కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు: RBIకి నిధులెక్కడివి, ఈ బదలీ ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఉండటం, ఈ ప్రభావం భారత్ పైన పడే అవకాశాలు కూడా ఉండటం, ఇప్పటికే ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.1.76 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదలీ చేయాలని నిర్ణయించింది. దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే, ప్రభుత్వం ధీటుగా సమాధానం చెబుతోంది. మిగులు నిధుల తరలింపు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బదలీ ఏమిటో తెలుసుకుందాం...
రూ.1.76 లక్షల కోట్లపై యుద్ధం! మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది?
మూడు వేర్వేరు నిధులు...
ఆర్బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించి నేపథ్యంలో ఈ బదలీ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ముందు అసలు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. సెంట్రల్ బ్యాంకు మూడు వేర్వేరు నిధులను కలిగి ఉంటుంది. వాటిని కలిపి నిల్వలుగా చెబుతారు. ఈ మూడు ఫండ్స్లలో కరెన్సీ అండ్ గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్ (CGRA), కాంటింగెన్సీ ఫండ్ (CF), అసెట్ డెవలప్మెంట్ ఫండ్ (ADF).
CGRAదే సింహభాగం
ఈ మూడు ఫండ్స్లలో CGRA చాలా పెద్దది. అలాగే ఆర్బీఐ నిల్వలలో సింహభాగం దీనిదే. బంగారం, ఫారన్ ఎక్స్చంజ్ రీవాల్యుయేషన్ లాభాలతో పాటు రూపొందించబడిన ఈ ఫండ్ 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి 6.91 లక్షల కోట్ల నిల్వలు కలిగి ఉంది. 2010 నుండి CGRA వృద్ధి గణనీయంగా ఉంది. వార్షిక వృద్ధి రేటు 25 శాతంగా ఉంది.
CF ఫండ్స్ రూ.2.32 లక్షల కోట్లు
ఆర్బీఐ నిధుల్లో రెండో అతిపెద్దది CF. 2017-18 నాటికి ఈ ఫండ్ రూ.2.32 లక్షల కోట్లు. మారకపు రేటు ఆపరేషన్స్, మానిటరీ పాలసీ నిర్ణయాల నుంచి అకస్మిక పరిస్థితులను తీర్చడానికి ఇది. ఆర్బీఐ లాభాల నుంచి కూడా నిధులు సమకూరుతాయి. ఇక మూడోది ADF. ఆర్బీఐలో దీని షేర్ అతి స్వల్పం.
ఆర్బీఐ వద్ద ఎంత ఉండాలి?
ఆర్బీఐ వద్ద ఎంత ఉండాలనేది క్లిష్టమైన అంశమే. అలాగే కేంద్ర ఖజానాకు ఎంత బదలీ చేయాలనే అంశంపై కూడా ఆర్బీఐ, కేంద్ర మంత్రిత్వ శాఖ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ అంశంపై మరింత వేడి రాజుకుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సెంట్రల్ బ్యాంకు స్వయం ప్రతిపత్తిపై మాట్లాడారు. దీంతో కాస్త వేడి రాజుకుంది. ఆర్బీఐ మిగులు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. దీనిని ఉద్దేశించి విరల్ ఆచార్య ఘాటుగా స్పందించారు. ఆర్బీఐ నిధులపై ప్రభుత్వం దాడి చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రపంచ నిబంధల కంటే ఆర్బీఐ వద్ద ఎక్కువ నిధులు ఉన్నాయని, వీటిని బదలీ చేయాలనేది ప్రభుత్వం వాదన.
కమిటీ ఏర్పాటు....
ఆర్బీఐ వద్ద ఎన్ని నిధులు ఉండాలి, ప్రభుత్వానికి ఎంత మేర బదలీ చేయాలనే అంశంపై తేల్చేందుకు చివరకు నవంబర్ 2018లో ఓ కమిటీని నియమించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమాల్ జలాన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. తాజాగా ఈ కమిటీ తన నివేదికను ఆర్బీఐకి సమర్పించింది. దాని ఆధారంగా రూ.1.76 లక్షల కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదలీ చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.
జలాన్ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి?
జలాన్ కమిటీ తన నివేదికలో పలు సూచనలు చేసింది. ఆర్బీఐ నిల్వల్లో రియలైజ్డ్ ఈక్విటీకి, రీవాల్యుయేషన్ కాంపొనెంట్కు మధ్య స్పష్టమైన భేదం ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఆర్బీఐ ఆస్తుల్లో రియలైజ్డ్ ఈక్విటీ వాటా 6.8% ఉంది. ఈ వాటా 5.5-6.5 స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ట్రాన్సుఫర్ చేయాలి. CFలోని ఆర్బీఐ ఆస్తుల్లో 5.5 శాతం కంటే ఎక్కువగా ఉండే బదలీ చేయాలి. ఈ అధిక మొత్తం రూ.52,637 కోట్లు.
రూ.1,23,414 బదలీ చేయాలి...
ఆర్బీఐ తన ఆస్తుల్లో మిగులు నిల్వల వాటాను (రియలైజ్డ్ ఈక్విటీ నిర్వహణ, రీవాల్యుయేషన్ నిల్వల లభ్యత ఆధారంగా) 20 నుంచి 24.5 శాతం స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఈ ఏడాది జూన్ నాటికి ఆర్బీఐ మిగులు నిధులు మొత్తం ఆస్తుల్లో 23.3 శాతంగా ఉన్నాయి. కాబట్టి వీటికి మరింత జోడించాల్సిన అవసరం లేదని జలాన్ కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల ఆర్బీఐ పూర్తి నికర ఆదాయం రూ.1,23,414ను కేంద్రానికి బదలీ చేయాలని పేర్కొంది.
ఈ రెండూ కలిపి రూ.1.76 లక్షల కోట్లు
రూ.1.23 లక్షలు మరియు రూ.52,637 కోట్లు... ఈ రెండు కలిపి రూ.1.76 లక్షల కోట్లుగా అవుతున్నాయి. ఈ మొత్తాన్ని కేంద్ర ఖజానాకు బదలీ చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. రూ.28,000 కోట్ల ఇంటర్మ్ డివిడెండ్ను కేంద్రానికి ట్రాన్సుఫర్ చేసింది. ఇది కూడా కలుపుకొని పై మొత్తం ట్రాన్సుఫర్ చేస్తారు.
ఆర్బీఐకి నష్టమా?
రూ.1.76 లక్షల కోట్లను బదలీ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే ఆర్థిక విపత్తులు సంభవించినప్పుడు ఆర్బీఐ వద్ద తక్కువ నిధులు ఉంటాయి. ఆర్బీఐ వద్ద కనీస నిల్వలు ఉంటాయి. అదనపు నిల్వలు ఖాళీ అయినట్లు. మినిమం నిల్వలకు చేరుకుంటాయి. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇది కనీస మొత్తాన్ని కలిగి ఉండటం పక్కన పెడితే, అదనపు నిధులు ఎప్పుడూ ఉపయోగపడతాయి.
రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు
2017-18 లెక్కల ప్రకారం ఆర్బీఐ వద్ద రూ.9 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు ఉన్నాయి. అందులో రూ.2.5 లక్షల కోట్లు కంటిజెన్సీ ఫండ్. కరెన్సీ, గోల్డ్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఫండ్ రూ.6.91 లక్షల కోట్లు. అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే ఆర్బీఐ వద్ద రెట్టింపు మిగులు నిధులు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఆర్బీఐ మిగులు నిధుల నిర్వహణ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, మిగులు నిధుల్లోంచి రూ.3.5 లక్షల కోట్లు తమ ఖజానాకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీనిని ఆర్బీఐ వ్యతిరేకించింది. ఉర్జిత్ పటేల్ ఉన్నప్పుడు.. ఆర్బీఐ, కేంద్రానికి మధ్య పొడచూపిన విభేదాల్లో ఇది ముఖ్యమైనది.