రూ.1.76 లక్షల కోట్లపై యుద్ధం! మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది?
న్యూఢిల్లీ: రూ.1.76 లక్షల కోట్ల మిగులు నగదు నిల్వలను కేంద్ర ఖజానాకు తరలించాలనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయంపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ దొంగిలిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ధీటుగా స్పందించారు. మరోవైపు, ఆర్బీఐ నిధుల తరలింపు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, పలు రంగాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మిగులు నిధులు ఖజానాకు తరలింపు సరైన చర్యగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఆర్బీఐ ఊహించని నిర్ణయం, కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్ల బొనాంజా
ఆర్బీఐ నిధుల దొంగతనం..
చేజేతులారా కొనితెచ్చుకున్న ఆర్థిక విపత్తును ఎలా పరిష్కరించాలో తెలియని ప్రధాని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్బీఐ సొమ్మును దొంగిలిస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రాక ఆర్బీఐపై ఆధారపడుతున్నారని, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆర్బీఐ నిధులను దొంగిలించడానికి తెగబడ్డారని, ప్రస్తుత జీడీపీ పతనం ప్రభుత్వం స్వయంకృతమన్నారు. దీనిపై నిర్మలా సీతారామన్ తీవ్రంగా గట్టి జవాబిచ్చారు. ఇతర బీజేపీ నేతలు కూడా ధీటుగా స్పందించారు.
విపక్షాలు...
ఇది ఆర్థిక వివేకమా లేక ఆర్థిక ఆత్మహత్యనా... అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. ఆర్భీఐ నుంచి ఇంత సొమ్ము తీసుకోవడం విపత్తు అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్బీఐ లాభాల్లో 99 శాతం కేంద్రానికి వస్తున్నాయని సీతారాం ఏచూరీ మండిపడ్డారు. నిధులను ఖజానాకు బదలీ చేసుకోవడం దివాలాకోరుతనమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
బీజేపీ ధీటుగా సమాధానం..
జలాన్ కమిటీ మేథావులతో ఏర్పాటయినదని, కమిటీని ఆర్బీ ఐ నియమించిందని, కమిటీ నిర్ణయాలను విమర్శించడం సరికాదని నిర్మల అన్నారు. అసలు ఇలాంటి విమర్శలపై స్పందించదలుచుకోలేదన్నారు. స్పందించదల్చుకోలేదు. దొంగతనాలు, కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకే సాధ్యమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ అన్నారు.
వీటికి ప్రయోజనం... ఊరట
మరోవైపు, ఆర్బీఐ నుంచి నిధుల ఖజానాకు రావడాన్ని ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వానికి చెల్లించే డివిడెండ్ల కంటే అధికం. బడ్జెట్లో వివిధ కేటగిరీల కోసం నిర్దేశించుకున్న రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడి ప్లాన్స్కు అవసరమైన నిధులు దీన్నుంచి పొందే ఆస్కారమున్నందువల్ల ప్రభుత్వం రుణసమీకరణ తగ్గించుకోగలుగుతుందని చెబుతున్నారు. బ్యాంకులకూ అదనపు మూలధన కల్పనకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. వృద్ధి రేటు తగ్గడం, వినియోగ వ్యయం పడిపోవడం, ఎఫ్ఎంసీజీ క్షీణత, ప్రైవేటు పెట్టుబడులు వెనక్కి తరలడం, ఆటో, రియల్ రంగాల్లో సంక్షోభం, నిరుద్యోగం పెరగడం వంటి తదితర పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ నిధులు ఊరట కలిగిస్తాయని చెబుతున్నారు.
ద్రవ్యోల్భణం ఆందోళన అవసరం లేదు...
ఆర్బీఐ నుంచి అందుతున్న నిధులు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. ఒక్కసారిగా ఇంత మొత్తం రావడం వల్ల ద్రవ్యోల్భణం పెరిగే ప్రమాదం ఉందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిని ఆలోచించకుండా నిర్ణయం తీసుకోదనేది ఇంకొందరి వాదన. ఆర్బీఐ నిధులను ఖర్చుల కోసం కాకుండా రాబడి వసూళ్లలో లోటును భర్తీ చేసుకోవడానికి వినియోగిస్తే ద్రవ్యోల్భణ సమస్య తలెత్తే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్భణం ఇప్పుడు ఆర్బీఐ నిర్దేశించిన దాని కంటే తక్కువ ఉంది. అందుకే ఆర్బీఐ వరుసగా రెపో రేటును తగ్గించిందని చెబుతున్నారు.
సంక్షోభంలో ఉన్న రంగాలకు ఆసరా...
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ నిధులు మందగమనానికి ఓ మందు అని చెబుతున్నారు. జీడీపీని పరుగులు పెట్టించేందుకు, పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు, మాంద్యం బారిన పడి సంక్షోభంలో ఉన్న ఆటో వంటి వివిధ రంగాలకు నిధులు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం అంతంతమాత్రంగానే ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల వైపు అడుగేయకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మోడీ సర్కారు ఈ నిధులు ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. దీంతో ద్రవ్యలోటుకు ప్రమాదం ఉండదంటున్నారు.
మందగమనానికి మందు
మొత్తానికి ఈ నిధులు మందగమనానికి మంచి మందు అనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్లు బదలీని ఆహ్వానించదగ్గదే అంటున్నారు. పెట్టుబడులు పెంచడానికి, వివిధ రంగాల ఉద్దీపనలకు తద్వారా మందగమనం పాలవుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. రుణాల్ని తగ్గించుకోవడానికి, రూ.3.3 లక్షల కోట్ల మూలధన ప్రణాళికలకు మద్దతివ్వడానికి, బ్యాంకులకు మూలధనం ఇవ్వవచ్చని అంటున్నారు.
నో చెప్పిన ఎస్బీఐ
తమకు సరిపడా మూలధనం ఉందని, ప్రభుత్వం నుంచి అదనపు నిధులు అవసరం లేదని ప్రభుత్వరంగ ఎస్బీఐ తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేస్తామని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించారు. తమకు ఆ నిధులు అవసరం లేదని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర బ్యాంకులకు వాటిని ఇస్తే బాగుంటుందని చెప్పారు.