రెండింతలు పెరిగిన ఉల్లి ధర, తగ్గిన కూరగాయలు, ఆంధ్రప్రదేశ్లో....
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు, కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. నెల రోజుల్లో ఉల్లిగడ్డ ధర రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగింది. భారీ వర్షాల కారణంగా ఉల్లిగడ్డ ఉత్పత్తి తగ్గింది. దీంతో మార్కెట్లు ధర పెరుగుతోంది. ఉల్లితో పాటు టొమాటో ధర కూడా పెరిగింది. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో వీటి ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి.
చైనాపై మరో 5% టారిఫ్ పెంచిన ట్రంప్, అమెరికన్లకు చుక్కలు!
పెరిగిన ఉల్లిగడ్డ ధర
దాదాపు పది రోజుల క్రితం ఉల్లిగడ్డ ధర క్వింటాల్కు రూ.1400 నుంచి రూ.1500 మధ్య ఉంది. ఆరు నెలల క్రితం ఉల్లి నాసిక్ ప్రాంతంలోని ఉల్లి రైతులు క్వింటాల్కు రూ.1000 నుంచి రూ.1200కు విక్రయించారు. సరాసరిగా రూ.800 నుంచి రూ.900 మధ్య విక్రయించారు. పది రోజుల క్రితం రూ.1400 వరకు ఉంది. గత మూడు నాలుగు రోజులుగా క్వింటాల్ రూ.2250 నుంచి రూ.2300 వరకు ఉంది.
వర్షాలు.. తగ్గిన సాగు
వర్షాల కారణంగా వెస్టర్న్ మహారాష్ట్రలో పంట మొత్తం కొట్టుకుపోయింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు, ట్రేడర్స్ నష్టపోయారు. పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 వరకు ఉంది. ఉల్లిసాగు మహారాష్ట్రలో ఎక్కువ. అక్కడ పంటలు దెబ్బతినడంతో పాటు గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ప్రభావం పడింది.
ఉల్లిగడ్డ ధర...
కర్ణాటకలోను మూడొంతుల ఉల్లి సాగు భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే సాగు తగ్గింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధర తెలుగు రాష్ట్రాలలో జూలైలో రూ.20 ఉండగా, ఆగస్ట్లో రూ.32 దాటింది. వారం రోజుల్లో దాదాపు రూ.10 పెరిగింది. మహారాష్ట్రవంటి కొన్ని చోట్ల రూ.50 అంతకుమించి కూడా పెరిగాయి.
ఏపీలో తగ్గిన టమాటో ధర...
కూరగాయల ధరలు గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ సాగు చేసిన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో టమాటో ధరలు పెరగ్గా, మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో టమాటో ధర దాదాపు సగం తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడం వల్ల టమాటో ధరలు తగ్గిపోయాయి.
నెల రోజుల్లో డబుల్...
ఉల్లిగడ్డ ధరలు ప్రధాన మార్కెట్లలో జూన్ మధ్యలో క్వింటాల్కు రూ.1200 నుంచి రూ.1350 మధ్య ఉండగా, జూలైలోనూ రూ.50, రూ.100 అటు ఇటుగా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం మహారాష్ట్రలోని లాసల్గావ్ మార్కెట్లో క్వింటాల్కు రూ.1350, బెంగళూరులో రూ.1750, కర్నూలులో రూ.2500, హైదరాబాదులో రూ.2300 వరకు ఉంది.
ఉల్లిగడ్డ పెరుగుదల... కేంద్రం అప్రమత్తం
ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కన్స్యూమర్స్ అపైర్స్ డిపార్టుమెంట్ ఇటీవల భేటీ అయింది. సామాన్యులు ఇబ్బందులు పడకుండా స్టాక్స్ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.