రూ 21,000 అయితేనే.... ఇండియా లో 5జి బూమ్
భారత దేశంలో త్వరలోనే 5జి సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు అటు ప్రభుత్వం... ఇటు టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు మొదలు పెట్టాయి. అయితే, ఇండియా లో 5జి టెలికాం సేవలు పెద్ద ఎత్తున విస్తరించాలంటే... ఈ టెక్నాలజీని సపోర్ట్ చేసే మొబైల్ హ్యాండ్సెట్ ధరలు అందుబాటు ధరల్లో లభించాలని దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ అంటోంది. అత్యంత వేగంగా డాటాను అందించే 5జి టెక్నాలజీని సపోర్ట్ చేసే మొబైల్ హ్యాండ్సెట్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయని, భారత్ లో మాత్రం అంత ధరలు ఉంటె లాభం లేదని దిగ్గజ కంపెనీ వ్యాఖ్యానించింది.
భారత్ లో డేటా వినియోగం మరో దశ కు చేరుకోవాలంటే... మొబైల్ హ్యాండ్సెట్ ధరలు $300 డాలర్ల (రూ 21,000) స్థాయికి తగ్గాల్సిందే. ప్రస్తుతం ప్రపంచం లో 5జి స్మార్ట్ ఫోన్లు $1,000 డాలర్ల (రూ 70,000) ధర పలుకుతున్నాయి అని భారతి ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సేఖోన్ తెలిపారు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. దేశంలో 4జి రెవల్యూషన్ కు కారణం కూడా ఆ సదుపాయాన్ని అందించే స్మార్ట్ ఫోన్లు కేవలం $100 డాలర్ల (రూ 7,000) కు లభించటమేనని ఆయన చెప్పినట్లు ఈటీ పేర్కొంది.
అందనంత ఎత్తులో.. పేమెంట్ యాప్లో చైనాతో భారత్ పోటీ!
110 మిలియన్ యూనిట్లు...
ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అంచనాల ప్రకారం.... ప్రపంచ వ్యాప్తంగా 5 జి స్మార్ట్ ఫోన్ ల లభ్యత 225% మేరకు వృద్ధితో ఏకంగా 110 మిలియన్ యూనిట్ల కు చేరనున్నాయి. స్మార్ట్ ఫోన్ లు లభిస్తాయి కానీ వాటి ధరలు ఎంత వరకు తగ్గుతాయి ఈ సంస్థ అంచనా వేయలేదు. అయితే, కంపెనీ ప్రతినిధి అంచనా ప్రకారం... ఇండియా లో తొలుత 2021 లో 5 జి సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, హైఎండ్ కస్టమర్లకు టెలికాం ఆపరేటర్లు తొలుత వీటిని అందించవచ్చని పేర్కొన్నారు. క్రమేపీ మిడ్ సెగ్మెంట్ లోకి ... ఆ తర్వాత మాస్ సెగ్మెంట్లో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
2019 లోనే.....
ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ... భారత ప్రభుత్వం మాత్రం 2019 లోనే 5 జి సేవలను దేశంలో ప్రారంభించాలని సంకల్పించింది. ఈ మేరకు 5జి స్పెక్ట్రమ్ వేలం వేసేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇందులో పాల్గొనేందుకు కఠినంగా ఉన్న నిబంధనలను సైతం సడలించింది. దీంతో ప్రస్తుత వేలం లో ఏ కంపెనీ ఐన... 5జి స్పెక్ట్రమ్ కోసం పోటీపడవచ్చు. కానీ ప్రభుత్వం ప్రకటించిన ధరలు టెలికాం ఆపరేటర్లకు చుక్కలు చూపుతున్నాయి. స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడం అసాధ్యమన్న స్థాయిలో ధరలు ఉన్నాయని అవి పేర్కొంటున్నాయి. అయితే, ఈ విషయంలో అటు ప్రభుత్వం... ఇటు కంపెనీలు ఎలా ముందుకు వెళ్లాలా అని మల్ల గుల్లాలు పడుతున్నాయి.
జియో సహా బడా కంపెనీలు...
ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శిస్తున్న రిలయన్స్ జియో.... 5జి వేట లో ముందు ఉంటుందని అందరు అంచనా వేస్తున్నారు. అలాగే... ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కూడా తప్పనిసరిగా 5జి సేవలను అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 5జి సేవల ను అందించే ప్రయోగ దశ పైలట్ ను ప్రారంభించేందుకు ఎయిర్టెల్ కంపెనీ ప్రిపేర్ అవుతోంది కూడా. ఈ విషయాన్నీ రణదీప్ ని ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎంపిక చేసిన కొన్ని ఫోన్లు, ఫిక్స్డ్ వైర్లెస్ సదుపాయం ఉన్న గృహాల్లో సిగ్నల్స్ ను పరిశీలించనున్నట్లు అయన వెల్లడించారు. 5జి సేవలు అందించాలంటే... 3.5 గిగా హెడ్జ్ లేదా సబ్ 6 గిగా హెడ్జ్ ఎయిర్ వేవ్స్ అవసరం అని అయన పేర్కొన్నారు.