భారత్.. జనాభా పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న విషయం తెలిసిందే. మన దేశంలో జనాభా శర వేగంగా పెరుగుతూనే ఉంది. ఇదే స్థాయిలో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. వీటిలో ముఖ్యంగా ఇంధనాలకు గిరాకీ బాగా పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఊపందుకుంటోంది. ఇదే పలు ప్రపంచ చమురు దిగ్గజ కంపెనీలు భారత్ మీద దృష్టి సారించడానికి ప్రధాన కారణంగా ఉంటోంది.
గత కొన్నేళ్లలో రష్యాకు చెందిన రొస్నేప్ట్, ఫ్రాన్సుకు చెందిన టోటల్, అబుదాబి కి చెందిన అడ్నాక్, కువైట్ పెట్రోలియం ఇంటర్నేషనల్ (కేపీఐ) లు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి.

ఇవి మరిన్ని కారణాలు..
* భారత దేశంలో ఇంధనాలకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడం లేదు. రానున్న కాలంలో మరింత పెరగడానికి అవకాశం ఉంది. ఎలక్ర్టిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నా ఇంధన వినియోగ వాహనాలకు ప్రాధాన్యం ఏమీ తగ్గదని, ఈ వాహనాలు కూడా మార్కెట్లో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. అందుకే చమురు రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
* రిటైల్, రిఫైనింగ్ కు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో స్ఫష్టత ఉంది. ఇవి విదేశీ కంపెనీలను ఆకట్టు కుంటున్నాయి. భారత మార్కెట్లో వ్యాపారం నిర్వహించేందుకు ప్రభుత్వం సులభతరమైన నిబంధనలను అమలు చేస్తోంది.
* ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. మనదేశంలో మాత్రం ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్ కు గిరాకీ పెరుగుతోంది.

* సౌదీ అరేబియా కు చెందిన ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటాను తీసుకోనుంది. ఈ వాటా విలువ రూ. లక్ష కోట్లకు పైనే ఉంటుంది. దేశంలో మంచి వ్యాపార అవకాశాలు ఉండటం వల్లనే ఈ కంపెనీ ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది.
అడ్నాక్
* 4,400 కోట్ల డాలర్లతో వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. ఇందులో సౌదీ అరాంకో తో కలిసి అడ్నాక్ భాగస్వామి కానుంది.

టోటల్
* రిటైల్ వ్యాపారం పై ద్రుష్టి పెట్టి అదానీ గ్రూప్ తో చేతులు కలిపింది. 2018 సంవత్సరంలో ఈ ఒప్పందం కుదిరింది. సిఎన్ జీ సరఫరా కోసం ఈ కంపెనీలు 1,500 ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నాయి.

బీపీ
* ఇంధనాల రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తో బ్రిటన్ కు చెందిన బీపీ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ తో కంపెనీకి ఇది మూడో జాయింట్ వెంచర్ కావడం విశేషం. కొత్త వెంచర్లో భాగంగా రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్ వర్క్ ను , విమాన ఇంధన వ్యాపారాన్ని విస్తరించనున్నారు.
రొస్నేప్ట్
* ఈ కంపెనీ ఎస్సార్ (ప్రస్తుతం నయారా ఎనర్జీ) లో 2017 సంవత్సరంలో 49.13 శాతం వాటా తీసుకుంది. ఆ వాటా విలువ 1,200 కోట్ల డాలర్లు.

గిరాకీకి ఢోకా లేదు
* తాజాగా క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం మనదేశంలో ఇంధనాలకు డిమాండ్ 2023 వరకు ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. 2030 నాటి వరకు ఇది 3.8 శాతంగా ఉండవచ్చని అంచనా.
* పెట్రో కెమికల్స్ రంగం వార్షికంగా 8 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని నివేదికలు వెలువడుతున్నాయి.
* స్థానికంగా డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో దేశ రిఫైనింగ్ రంగంలోకి రూ. 1.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications