మీ కోసమే వెయిటింగ్: వాలంటీర్లకు జగన్ బంపరాఫర్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం రోజున వాలంటీర్ల వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ కన్న కలల్ని సాకారం చేసే దిశగా ఏపీలో విప్లవాత్మక పునాది పడిందని, బాపూజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని, స్థానిక స్వపరిపాలనలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నవశకానికి నాంది పలికిందన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి బంపరాఫర్ ఇచ్చారు.
అందరికీ మంచి జరిగితే...
కుల, మత, రాజకీయాలకు అతీతంగా లంచాల్లేని వ్యవస్థ అవసరమని తాను పాదయాత్ర సందర్భంలో గుర్తించి, వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చానని జగన్ చెప్పారు. కనీస సదుపాయాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉండవద్దన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి ఒక్కరికి మంచి జరిగితే ప్రజలు మళ్లీ ఓటు వేస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు పని చేయాలన్నారు.
ఈసారి మనకే ఓటు వేస్తారు
వాలంటీర్లు పారదర్శకతతో పని చేయాలని జగన్ సూచించారు. మనకు ఓటు వేసినవారు, ఓటు వేయని వారు అని బేధం చూపవద్దని, అందరినీ సమానంగా చూడాలని సూచించారు. అప్పుడే మనకు ఓటు వేయని వారు కూడా వచ్చేసారి ఓటు వేస్తారన్నారు. మీ (వాలంటీర్) ద్వారా నా హామీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చేరాలన్నారు.
నాయకులుగా చేస్తా...
వాలంటీర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే అపవాదు రావొద్దని జగన్ అన్నారు. ఆదర్శపాయమైన వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల కోసం కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలను గుర్తించి ఇప్పించడం వాలంటీర్ల బాధ్యత అని, నిజాయితీగా పని చేస్తే మీ అందర్నీ నాయకులను చేస్తానని చెప్పారు.
మీ కోసం వెయిటింగ్
తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలో 80 శాతం హామీలు నెరవేరుస్తుందని, ఇందుకు వాలంటీర్ల వ్యవస్థ అవసరమని జగన్ చెప్పారు. చాలా పథకాలు మీకోసం (వాలంటీర్) వేచి చూస్తున్నాయని, ఎందుకంటే ఏదైనా పథకం ప్రజలకు సంతృప్తస్థాయిలో చేరుకోవాలంటే మీ ద్వారానే సాధ్యమన్నారు. మీ కోసం పథకాలు ఆపామని, మీరు వచ్చారు కాబట్టి పరుగులు పెట్టిస్తామన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఏ పథకాలైనా అందకుంటే, మీరు (వాలంటీర్లు) వారి వద్దకు వెళ్లి తెలియజెప్పి, ఆ పథకం లేదా సేవలు అందేలా చూడాలన్నారు.
ప్రజలు ఏది అడిగినా ఓపికగా సమాధానం చెప్పాలి..
ప్రజలు లీడర్ లేదా నాయకుడి నుంచి ఇలాంటి సేవను ఆశిస్తారని జగన్ చెప్పారు. అది జగన్ కావొచ్చు.. మీరు కావొచ్చు ప్రజలు మాత్రం దీనిని కోరుకుంటారన్నారు. ప్రజలవద్దకు వెళ్లినప్పుడు సహనం కలిగి ఉండాలని, చిరునవ్వుతో పలకరించాలన్నారు. తనను ఎప్పటికప్పుడు అనుకరించి, ప్రభుత్వ యాక్టివిటీస్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు ఏది అడిగినా సమాధానం చెప్పేలా ఉండాలన్నారు.
వాలంటీర్లకు టోల్ ఫ్రీ నెంబర్
ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఉగాది నాటికి ఉగాది లేదా భూమి ఇస్తామని జగన్ చెప్పారు. అమ్మఒడి, రైతు భరోసా, పేదలకు ఇళ్లు వంటి పథకాలు వాలంటీర్ల ద్వారా అందజేయబడతాయన్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీని సెప్టెంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వాలంటీర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1902 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2,66,796 వాలంటీర్ల నియామకం
కాగా, 45 రోజుల వ్యవధిలో గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వాలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందులో సగం మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు, గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించింది. వీరు గురువారం నుంచే విధుల్లో చేరారు. జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు అందరూ వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేశారు.