విస్తారా నష్టం రెండింతలు, రూ.831 కోట్ల నష్టం
టాటా - సింగపూర్ ఎయిర్ లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.831 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఇతర సహచర సంస్థలు కూడా బలహీన ఫలితాలు చవిచూశాయి. అయితే ప్రస్తుత సంవత్సరంలో ఈ సంస్థ ఆర్థిక పనితీరు మెరుగుపడుతుందని భావిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్ మూత అనంతరం ప్రీమియం క్లాస్ ఆక్యుపెన్సీలో ఇది తన నెట్ వర్క్ను పెంచుకుంటోంది.
విస్తారా అంతకుముందు ఏడాది రూ.431 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది అంతకు రెండింతలు నష్టాన్ని నమోదు చేసింది. విస్తారాలో గత ఏడాది రెండు కొత్త విమానాలు చేరాయి. దీంతో ఎయిర్ లైన్స్ సామర్థ్యం పెరిగింది. అలాగే రెవెన్యూ కూడా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5 మిలియన్ల మంది ప్రయాణించారు. అయితే ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనపడటం వంటి కారణాలతో నష్టపోయింది.
సగటున ఏవియేషన్ టర్బైన్ 2018తో పోలిస్తే 2019లో (ఆర్థిక సంవత్సరం) 23 శాతం పెరిగింది. అదే సమయంలో డాలర్ మారకంతో రూపాయి విలువ 8 శాతం తగ్గింది. వీటి వల్ల డొమెస్టిక్ విమానయాన సంస్థల ఖర్చులు పెరిగాయి. ఇతర దేశీయ విమానయాన సంస్థలు కూడా గత ఆర్థిక సంవత్సరంలో నిరాశాజనక ఫలితాలు వెల్లడించాయి.
మార్కెట్ వాటా ప్రకారం దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నెట్ ప్రాఫిట్ 93 శాతం క్షీణించి రూ.156 కోట్లకు చేరుకోగా, స్పైస్ జెట్ రూ.316 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మాత్రం ఇండిగో, స్పైస్ జెట్లు మెరుగుపడ్డాయి. ఈ త్రైమాసికంలో విస్తారా ఏ మేరకు పుంజుకుందో తెలియాల్సి ఉంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో విస్తారా నష్టాలు తమ అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నాయని, తొలి అర్థ సంవత్సరం సవాలుగా మారిందని, ఈ ప్రభావం ఆ తర్వాత కూడా కనిపించిందని, జెట్ ఎయిర్వేస్ మూతబడటం విస్తారాకు సానుకూలంగా మారిందని, మరింత రెవెన్యూ తెచ్చి పెడుతోందని, అయితే లాభాలను చేరుకోవాలంటే మరింత సమయం పడుతుందని కాపా కన్సల్టెన్సీ సౌత్ ఏసియా సీఈవో కపిల్ కౌల్ అన్నారు.