చంద్రబాబు ఎఫెక్ట్! కొనుగోళ్లపై జగన్ కీలక నిర్ణయం
అమరావతి: తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం చెబుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యుత్ పీపీఏల ఒప్పందాల పునఃసమీక్ష, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్స్, కృష్ణా కరకట్టపై అక్రమ నివాసాల కూల్చివేత.. ఇలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని ఆయన పదేపదే చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతిరహితంగా ముందుకు సాగుతుందని చెబుతూ.. ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్.
మీ కోసమే వెయిటింగ్: వాలంటీర్లకు జగన్ బంపరాఫర్!
రూ.1 కోటి దాటిన కొనుగోళ్లు వెబ్సైట్లో..
పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతికి తావులేని విధంగా తన పరిపాలన ఉండాలని, ఇందులో భాగంగా రూ.1 కోటి దాటిన ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో పెట్టాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులతో ఈ అంశంపై మాట్లాడిన జగన్, ఆదేశాలు జారీ చేశారు. కోటి రూపాయలు దాటిన ప్రభుత్వ కొనుగోళ్ల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, తద్వారా పాలనలో పారదర్శకత తీసుకు వస్తున్నామన్నారు.
అన్నీ దీని పరిధిలోకి వస్తాయి..
అన్ని ప్రభుత్వ శాఖలు, పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్య డిపార్టుమెంట్స్ కూడా వెంటనే ఈ నిబంధన పరిధిలోకి వస్తాయని జగన్ చెప్పారు. తద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసే లేదా ఖర్చు చేసే ప్రతిది పారదర్శకంగా ఉంటుందన్నారు.
బిడ్డింగ్ ద్వారానే కొనుగోళ్లు
'అందరికి ఆమోగ్యమయ్యే విధంగా ప్రభుత్వాన్ని నడపాలి. అన్ని కొనుగోళ్లు కూడా బిడ్డింగ్ ద్వారానే చేయాలి. బిడ్డింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే కాంట్రాక్టర్ పేరును వెల్లడించాలి' అని జగన్ అన్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలను ఆగస్ట్ 28వ తేదీన మాట్లాడుదామని, అన్ని వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్లు మరింత పారదర్శకంగా ఉండేందుకు సూచనలు చేయాలని అధికారులను జగన్ కోరారు.
ఇలా చేయండి...
రూ.కోటి దాటి ఏం కొనుగోలు చేసినా ఆ వివరాలు వెబ్ సైట్లో పెట్టాలని, ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామో కూడా పొందుపర్చాలని, అదే సమయంలో అంతకంటే తక్కువకు కోట్ చేయదలుచుకునేవారికి ఆ కాంట్రాక్టు ఇవ్వాలని, మన ప్రభుత్వ విధానం భారతదేశానికి ఆదర్శంగా ఉండాలని జగన్ చెప్పారు. ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే టెండర్లు ఆహ్వానించాలని, ఖరారైన తర్వాత ఎవరికి ఇస్తున్నామో వారి పేరు, ధరను వెబ్ సైట్లో ఉంచాలన్నారు. రివర్స్ టెండరింగ్కు కొంత సమయం ఇవ్వాలన్నారు.
ఎవరికీ భయపడొద్దు.. అనుకూలం వద్దు
మరోవైపు, కేబినెట్ సబ్ కమిటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ హయాంలో భారీ అవినీతి జరిగిందని, దీనికి సంబంధించి ఎలాంటి భయం లేకుండా, ఎవరికీ అనుకూలంగా లేకుండా దర్యాఫ్తు జరగాలన్నారు.