జగన్ స్పీడ్కు జపాన్ ప్రభుత్వం బ్రేక్! దూకుడు తగ్గించాలని సలహా
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జపాన్ లేఖ రాసింది. ఆ లేఖ కూడా ఏదో కుశలప్రశ్నలు వేస్తూ.. అభినందనలు తెలిపే లేఖ ఎంత మాత్రమూ కాదు. ప్రభుత్వ విధానాలను తూర్పారబడ్తూ.. అతి ఆవేశం తగ్గించుకోవాలని దాదాపుగా హెచ్చరించినట్టు చేసే లేఖ. అవును జపాన్ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్కు లేఖ రాసింది. పునరుత్పాదక ఇంధన టారిఫ్లలో మార్పులు చేయాలని అనుకుంటున్న ప్రభుత్వ ఆలోచన.. విదేశీ ఇన్వెస్టర్లకు ముచ్చెమటలు పట్టిస్తోందని, ఏకంగా పెట్టుబడుల పర్యావరణానికే తూట్లు పొడుస్తోందంటూ హెచ్చరించింది.
ఏపీకి గుడ్న్యూస్, ప్యామిలీకి హెల్త్ కార్డు: రూ.1000 దాటితే ఫ్రీ వైద్యం!
ఏంటీ లేఖ సారాంశం
ఇండియాలో జపానీస్ ఎంబాసిడర్ కెంజి హిరమత్సు వైఎస్ జగన్కు రాసిన లేఖ ప్రకారం ఏపీలో ప్రభుత్వం ఇంధన రంగంపై జరుగుతున్న సమీక్షలు, ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను అనేక మంది విదేశీ పెట్టుబడులు, అలానే జపాన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఈ రంగంలో గతంలో చేసుకున్న ఒప్పందాలు, రేట్లు, కాంట్రాక్టులను సవరించాలనే యోచనలో ప్రభుత్వం ఉండడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది. భారత దేశ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోకి ఫ్రాన్స్, సౌతాఫ్రికా, యూరోప్ దేశాల నుంచి కూడా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వచ్చి పడ్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటూ జపాన్ ఆక్షేపించింది.
జపాన్కు ఎందుకు టెన్షన్
జపాన్కు చెందిన ఇన్వెస్టర్లు మన దేశంలో ఎస్.బి. ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ అనే సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. SB Energy సంస్థలో తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, సాఫ్ట్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాజెక్టులు చేపడ్తోంది. ఇక రెన్యూ పవర్ ReNew power సంస్థలో జపాన్కు చెందిన ప్రముఖ సంస్థ జెరా కూడా నిధులు కుమ్మరించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఒక వేళ గత కాంట్రాక్టులను రద్దు చేసుకున్నా, పునఃసమీక్షించినా దాని ప్రభావం ఇన్వెస్టర్లపై ఉంటుందనేది జపాన్ భయం. చట్టప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రభుత్వాలు మారినా గౌరవించాల్సి ఉంటుందని, ఒక వేళ అలా జరగని పక్షంలో ఏపీలో పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని జపాన్ ఎంబసీ సెకెండ్ సెక్రటరీ సతోసి తకాగి వెల్లడించారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత కాలం క్రితం ఏపీ చీఫ్ సెక్రటరీకి ఈ వ్యవహారంపై లేఖ రాసింది. ముందే అంతంతమాత్రంగా ఉన్న పెట్టుబడుల వాతావరణంపై ఇలాంటి దుందుడుకు చర్యలు మరింత ఇబ్బంది పెడ్తాయంటూ సున్నితంగా చురకలు అంటించింది. మీ ముఖ్యమంత్రికి ఈ విషయాలు అర్థమయ్యేలా వివరించాలంటూ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఇతర దేశాలు కూడా ఈ వ్యవహారంపై స్పందించడం ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షిస్తోంది.
ఏపీలోనే ఎందుకు
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానంలో ఉంది. సుమారు 7257 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది. ఇందులో 3279 మెగావాట్లు సోలార్ పవర్ కాగా, మరో 3978 మెగావాట్లు విండ్ పవర్ ఉంది. గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలన్నీ తప్పులతడకగా ఉన్నాయని, ఎక్కువ రేట్లకు యూనిట్లు కొంటున్నారంటూ కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో పాత కాంట్రాక్టులను రద్దు చేయడం, లేదా సమీక్షించాలని చూస్తోంది. అందుకే ఈ రంగంపై ఇప్పుడు పెట్టుబడిదార్లలో టెన్షన్ మరింత పెరిగింది.