ఆందోళన: 19ఏళ్ల తర్వాత భారీ మాంద్యం, 15,000 ఉద్యోగాలు కట్
ముంబై: ఆటో పరిశ్రమ సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో నెలలో కూడా వాహనాల విక్రయాలు పడిపోయాయి. జూలై నెలలో ఆటోమొబైల్ సేల్స్ 18.71 శాతం తగ్గి, 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని SIAM (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్) నివేదిక వెల్లడించింది. పాసింజర్ వెహికిల్స్, టూవీలర్స్ సహా అన్ని వాహనాల విక్రయాలు కలిపి గత జూలై నెలలో 18,25,148 మాత్రమే. అంతకుముందు ఏడాది ఇదే నెలలో (2018 జూలై) 22,45,223గా ఉన్నాయి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు: వీరు అప్లై చేసినా అనర్హులు
15,000 ఉద్యోగాలు కట్
ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పడిపోతుండటంతో కంపెనీలు, సంస్థలు, విక్రయ కేంద్రాలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. గత మూడు నాలుగు నెలల్లోనే దాదాపు 15,000 మంది ఉద్యోగం కోల్పోయారు. అంతకుముందు, 2000 సంవత్సరంలో ఆటో ఇండస్ట్రీలో 21.81 శాతం విక్రయాలు పడిపోయాయి. ఆ తర్వాత ఇలా ఎప్పుడూ తగ్గలేదు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత భారీగా విక్రయాలు తగ్గాయి.
19 ఏళ్ల కనిష్టానికి పాసింజర్ వెహికిల్స్ సేల్స్
డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు కూడా పందొమ్మిదేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. 2018 జూలైలో వీటి అమ్మకాలు 2,90,931 ఉండగా, ఈ ఏడాది జూలైలో 30.98 శాతం సేల్స్ తగ్గి 2,00,790 యూనిట్లకు పరిమితం అయ్యాయి. అంతకుముందు 2000 సంవత్సరంలో వీటి విక్రయాలు35.22 శాతం తగ్గాయి. వీటి విక్రయాలు కూడా వరుసగా తొమ్మిదో నెల పడిపోయాయి.
భారీగా తగ్గిన పాసింజర్ కారు సేల్స్
2000 డిసెంబర్లో పాసింజర్ కారు సేల్స్ 39.86 శాతం తగ్గాయి. ఆ తర్వాత మళ్లీ పందొమ్మిదేళ్లకు ఇప్పుడు జూలై నెలలో 35.95 శాతం సేల్స్ పడిపోయాయి. 2018 జూలైలో ఈ వాహనాల సేల్స్ 1,91,979 కాగా ఈ జూలైలో 1,22,956కు పడిపోయాయి.
తగ్గిన టూవీలర్స్ సేల్స్
టూవీలర్స్ విషయానికి వస్తే ఈ జూలైలో 16.82 శాతం సేల్స్ తగ్గాయి. 2018 జూలైలో వీటి విక్రయాలు 18,17,406 కాగా, ఇప్పుడు 15,11,692కు పడిపోయాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 25.71 శాతం తగ్గాయి. గత ఏడాది జూలైలో 76,545 కాగా, ఇప్పుడు 56,866 యూనిట్ సేల్స్ జరిగాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ అన్నారు. దాదాపు 15వేలమంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇందులో ఎక్కువగా టెంపరరీ, కాజువల్ వర్కర్స్ ఉన్నారన్నారు. దాదాపు 300 డీలర్షిప్స్ క్లోజ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. 2008-09, 2013-14లలోను ఈ మాంద్యాన్ని చూశామని, కానీ కొన్ని సెగ్మెంట్లలో వృద్ధి కనిపించిందని, కానీ ఈసారి అన్ని సెగ్మెంట్స్ది అదే పరిస్థితి అన్నారు. ప్రభుత్వం పునరుద్ధరణ ప్యాకేజీతో ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు.
3.7 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు..
ఆటో పరిశ్రమకు జీఎస్టీ రేటును తగ్గించాలని ఇప్పటికే ఈ పరిశ్రమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వాహన స్క్రాపేజ్ విధానం ప్రవేశపెట్టాలని, సేల్స్ ఎన్బీఎఫ్సీ సెక్టార్ పైన ఆధారపడుతాయని, కాబట్టి ఆ సెక్టార్ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపు విషయంలో ఆటో ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉందని, ఇది వాహనాల కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. పరిశ్రమ క్షీణిస్తే జీడీపీ కూడా తగ్గుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.7 కోట్ల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని చెప్పారు.
పేరుకుపోతున్న వాహనాలు
సేల్స్ లేకపోవడంతో ఆటోమొబైల్ సంస్థల వద్ద వాహనాలు పేరుకుపోతున్నాయి. దీంతో ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీలు భావిస్తున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్ ఇండియా... ఇలా అన్ని సేల్స్ తగ్గాయి.