మోడీకి 'ఆటో' సవాల్: లక్షలాది మంది ఉద్యోగాల హుష్కాకీ
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. కార్లు, బైక్ సేల్స్ లేకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. పలు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. కొన్ని సంస్థలు మూతబడ్డాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. గత ఏప్రిల్ నెల నుంచి సేల్స్ లేక దాదాపు 3,50,000 మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ఇండస్ట్రీ సీనియర్ నిపుణులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
సరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి
ఎక్కడ ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారంటే?
ఇంతకుముందు లెక్క ప్రకారం కారు, మోటార్ సైకిల్ మేకర్స్లో 15,000 మంది, కాంపోనెంట్ మానుఫ్యాక్చరర్స్లో 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మిగతా ఉద్యోగాలు డీలర్స్ స్థాయిలో కోల్పోయారు. ఇందులో పలు దుకాణాలు మూతబడ్డాయని చెబుతున్నారు.
మోడీ ప్రభుత్వానికి పెద్ద సవాల్
ప్రస్తుతం ఆటో పరిశ్రమ తీవ్ర మందగమనం ఫేస్ చేస్తోంది. ఇప్పటికే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు ఆటో పరిశ్రమలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీకి ఇది పెను సవాల్ అంటున్నారు. ఈ రంగాన్ని పునరుద్ధరించేందుకు ఆటో ఎగ్జిక్యూటివ్స్ బుధవారం ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పన్ను తగ్గింపులు, డీలర్లకు, కస్టమర్లకు సులభ ఫైనాన్స్ యాక్సెస్ ఉండాలని వారు డిమాండ్ చేసారు.
ఆయా కంపెనీలో తొలగించబడిన ఉద్యోగులు
జపాన్కు చెందిన మోటార్ సైకిల్ తయారిదారు యమహా మోటార్, ఫ్రాన్స్కు చెందిన వాలెయో, సుబ్రోస్తో సహా తయారీదారులు తమ అమ్మకాలు క్షీణించిన అనంతరం భారతదేశంలో 1,700 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించిందట. జపాన్కు చెందిన డెన్సో కార్ప్, సుజుకి మోటార్ కార్ప్లు 800 మంది వర్కర్స్ను తొలగించాయి. ఇండియన్ పార్ట్స్ మేకర్ వీ-గీ-కౌషికో 500 మందిని, యమహా, వాలెయో కంపెనీలు 200 మంది చొప్పున ఉద్యోగులను తొలగించాయి.
ఇండియా జీడీపీలో 7 శాతం
అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో కారు మేకర్స్ హోండా మోటారో కో, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు సహా పలు కార్ల తయారీ కంపెనీలు ఈ దిశలో యోచిస్తున్నాయని చెబుతున్నారు. ఇండియా జీడీపీ రేటులో ఆటోమొబైల్ రంగానికి 7 శాతం. కానీ ఇప్పుడు తీవ్రమైన తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది.
35 మిలియన్ల మందికి ఉపాది
పాసింజర్ వాహనాలు వరుసగా తొమ్మిదో నెల కూడా పడిపోయాయి. కొన్ని వాహన కంపెనీలు 30 శాతం అంతకంటే ఎక్కువ క్షీణతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోమొబైల్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2019 జూలై నెలలో భారత్ జాబ్ లాస్ రేటు 7.51 శాతానికి పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 5.66 శాతంగా ఉండేది.