ఐఎంపీఎస్ లావాదేవీల జోరు.. జూలైలో రూ.1.82 లక్షల కోట్లు
ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లను వినియోగించుకుంటూ నగదు బదిలీ చేస్తున్నవారు బాగా పెరిగిపోతున్నారు. క్షణాల వ్యవధి లోనే నగదు బదిలీ చేసే అవకాశం ఉండటం, చార్జీలు కూడా మరీ ఎక్కువగా లేకపోవడం, రోజులో ఎప్పుడైనా వల్ల ఐఎంపీఎస్ లావాదేవీలు నిర్వహించే సౌలభ్యం ఉండటం వల్ల దీనికి అధిక ఆదరణ లభిస్తోంది.
పడిపోయిన డొమెస్టిక్ సేవింగ్స్: ఖర్చుకు మొగ్గు, పెరిగిన రుణాలు
నేషనల్ పేమెంట్ కార్పోరేషన్
* నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీ సీఐ) వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన జూలై నెలలో ఐఎంపీఎస్ లావాదేవీలు 19 కోట్లకు పెరిగాయి. వీటి విలువ రికార్డు స్థాయిలో రూ. 1.82 లక్షల కోట్లకు పైగా ఉంది.
* జూన్ నెలలో 17.13 కోట్ల లావాదేవీలు జరగ్గా వీటి విలువ రూ. 1. 73 లక్షల కోట్లు గా నమోదైంది.
* ఇంతకు ముందు గత మార్చిలో లావాదేవీలు 19.01 కోట్ల జరిగినా వాటి విలువ మాత్రం రూ.1.76 లక్షల కోట్లు గా మాత్రమే నమోదైంది.
* బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బిజినెస్ కరెస్పాండెంట్స్ ద్వారా ఐఎంపీఎస్ సర్వీసును అందిస్తున్నాయి.
రానున్న మరింత పెరిగే చాన్స్
భారత రిజర్వ్ బ్యాంకు ఐఎంపీఎస్ చార్జీలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తాము కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీలను తగ్గిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎంపీఎస్ చార్జీలను తగ్గించింది. ఆగష్టు ఒకటో తేదీ నుంచి ఈ చార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇతర బ్యాంకులు కూడా తమ చార్జీలను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి రానున్న కాలంలో ఐఎంపీఎస్ లావాదేవీలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. 498 సభ్య బ్యాంకులు ఐఎంపీఎస్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
యూపీఐ, భీమ్ లావాదేవీలు కూడా
* ఐఎంపీఎస్ లావాదేవీల మాదిరిగానే యూపీఐ, బీమ్ యాప్ లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటి విలువ మాత్రం తగ్గుతోంది. వరుసగా రెండో నెలలోను వీటి విలువ తగ్గింది.
* జూలై నెలలో యూపీఐ లావాదేవీలు 82.2 కోట్లకు చేరాయి. అంతకు ముందు నెలలో ఇవి 75.4 కోట్లుగా ఉన్నాయి.
* జులైలో లావాదేవీల విలువ మాత్రం రూ.1.46 లక్షల కోట్లకు తగ్గింది. మే నెలలో వీటి విలువ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రూ. 1.52 లక్షల కోట్లుగా నమోదైంది.
* జులైలో భీమ్ ద్వారా జరిగిన లావాదేవీల (1.6 కోట్లు) విలువ రూ. 6,121.67 కోట్లు ఉండగా. జూన్ నెలలో రూ. 6,202.49 కోట్లు, మే నెలలో రూ. 6,627.42 కోట్లుగా ఉన్నాయి.
* ప్రస్తుతం యూపీఐ పై 143 బ్యాంకులు, భీమ్ యాప్ పైన 114 బ్యాంకులు సేవలను అందిస్తున్నాయి.