దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసిన హెచ్డీఎఫ్సీ ఛైర్మెన్ దీపక్ పరేఖ్
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థపై లార్సెన్ అండ్ టూబ్రో ఛైర్మెన్ ఏఎం నాయక్ ఆందోళన వ్యక్తం చేసిన రెండ్రోజులకే ఈ సారి హెచ్డీఎఫ్సీ ఛైర్మెన్ దీపక్ పరేఖ్ కూడా ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందన్న వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీల్లో ,హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బుల కొరత ఉండటం, అదే సమయంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే కారణమని అన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోకి పయనించాలంటే రుణదాతల్లో ఆత్మవిశ్వాసం నింపాలనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు దీపక్ పరేఖ్.
కొన్ని హై రేటింగ్లో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని వాటికి అన్ని అర్హతలున్నప్పటికీ రుణాలు ఇవ్వకపోవడం, ఇంకొన్ని ఆర్థిక సంస్థలకు రుణాలు అసలే ఇవ్వకపోవడంతో ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతోందని పరేఖ్ అన్నారు. దీని ఫలితంగానే చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు హెచ్ఎఫ్సీలు నిధుల విడుదలను నిలిపివేశాయని చెప్పారు. ఈ ప్రభావం ఇతర రంగాలపై పడిందని చెప్పారు. అయితే త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండగ సీజన్ వచ్చే నాటికల్లా అన్ని కుదురుకుంటాయనే విశ్వాసం వ్యక్తం చేశారు పరేఖ్.
2019 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మందగించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్న పరేఖ్.. జీడీపీ 6.8శాతం నమోదు కావడమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే ఎనిమిది ప్రధాన రంగాలు గత 50 నెలల్లో ఎప్పుడూ లేనంతగా 0.2శాతానికి పడిపోయిన నేపథ్యంలో దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మే నెలలో జీడీపీ 5.8 శాతం ఉండగా... అది జూన్ నాటికి 4.8కు పడిపోయింది. ఇక రియల్ ఎస్టేట్ రంగంపై మాట్లాడిన పరేఖ్... ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతోందని అన్నారు. వాణిజ్య రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరుగుతోందని చెప్పిన పరేఖ్... ఈ డిమాండ్ ఎక్కువగా ఐటీ సెక్టార్, ఈ-కామర్స్, ప్రొఫెషనల్ మరియు సేవల రంగాల్లో ఎక్కువగా ఉందని చెప్పారు.
ఇదిలా ఉంటే అమెరికా చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని భారత్ అడ్వాటేజ్గా తీసుకోవాలని ఎల్ అండ్ టీ ఛైర్మెన్ నాయక్ చెప్పారు. అంటే చైనాను వీడుతున్న కంపెనీలు భారత్కు తెచ్చుకునేలా ప్రభుత్వం ప్రయత్నించాలని అయితే అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదని నాయక్ చెప్పారు. దీంతో చైనాను వీడిన కంపెనీలు వియత్నాం థాయ్లాండ్ వైపు మొగ్గు చూపాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు భారత్కు వచ్చాయని ప్రశ్నించిన నాయక్.... గత రెండేళ్లుగా చైనా నుంచి అమెరికా కంపెనీలు వైదులుగుతాయని ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం ఎన్నికల బిజీలో ఉండిపోయి ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని గుర్తుచేశారు నాయక్.