పోరాడలేను: బిజినెస్ ఫెయిల్యూర్ అంటూ ఉద్యోగులకు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ లేఖ, మైండ్ట్రీ ప్రస్తావన
ముంబై/బెంగళూరు: కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళూరులో నేత్రావతి నది వద్ద సోమవారం కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వీజీ సిద్ధార్థ నది బ్రిడ్జి పైన కారు దిగి ఫోన్ మాట్లాడుతూ కాసేపు నడిచాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో డ్రైవర్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు. వీజీ సిద్ధార్థ మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు. విషయం తెలిసి ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మిస్సింగ్, బ్రిడ్జిపై కారు ఆపి.. ఏం జరిగిందంటే?
వీజీ సిద్ధార్థ లేఖ
మరోవైపు, వీజీ సిద్ధార్థ కేఫ్ కాఫీ డే (CCD) బోర్డుకు, ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అదృశ్యం కావడానికి ముందు ఈ లేఖ రాశారు. నేను చాలా కాలం పోరాడానని, కానీ ఏం చేయలేక వదిలేస్తున్నానని, షేర్ల బైబ్యాక్ విషయంలో ఓ ప్రయివేటు ఈక్విటీ పార్ట్నర్స్ ఒత్తిడిని తాను తీసుకోలేకపోయానని, ఓ స్నేహితుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాఫీడే ఓనర్గా విఫలమయ్యా.. క్షమించండి
కాఫీ డే కంపెనీ రూ.7,000 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఆస్తులు, అప్పుల వివరాల జాబితాను అందిస్తూ కంపెనీ కొత్త యాజమాన్యం నిర్వహణలో నడపాలని వీజీ సిద్ధార్థ బోర్డు డైరెక్టర్లకు సూచించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశ్యం లేదని, కాఫీ డే కంపెనీ వ్యవస్థాపకుడిగా విఫలమయ్యానని, అదో ఒకరోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. క్షమించండి అని లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయాలు ఎవరికీ తెలియదు..
ఆదాయ పన్ను గత డీజీ నుంచి తాను వేధింపులు ఎదుర్కొన్నానని, మైండ్ ట్రీ డీల్ అంశంపై రెండుసార్లు తమ షేర్ల అటాచ్ ఎదుర్కొన్నానని, కాఫీ డే షేర్ల విషయంలోను వేధింపులు అనుభవించానని వీజీ సిద్ధార్థ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి నెలలో మైండ్ట్రీలోని తన 20 శాతంకు పైగా వాటాను ఎల్ అండ్ టీకి విక్రయించడం ద్వారా వీజీ సిద్ధార్థ పతాక శీర్షికలకు ఎక్కారు. తనపై కంపెనీ ఉద్యోగులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, దానిని వమ్ము చేస్తున్నందుకు క్షమించాలన్నారు. కొత్త యాజమాన్యంతో మీరంతా బలంగా ఉండి ఈ వ్యాపారాన్ని కొనసాగించాలన్నారు.
2017లో ఐటీ సోదాలు
తన తప్పులన్నింటికీ తనదే బాధ్యత అని వీజీ సిద్ధార్థ పేర్కొన్నారు. తన లావాదేవీల గురించి మేనేజ్మెంట్కు, ఆడిటర్లకు తెలియదని చెప్పారు. వాటికి తానే జవాబుదారీని అన్నారు. నేను విఫలమైన వ్యాపారవేత్తనని లేఖలో పేర్కొన్నారు. కాగా, 2017లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తొలిసారి ఆయన ఇళ్లు, కంపెనీల్లో సోదాలు చేసి, రూ.650 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.