అక్టోబర్లో అప్పుల వేట ! గ్రేట్ ఇండియన్ బాండ్ సేల్
అప్పుల వేటలో పడిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు అక్టోబర్ నెలను మూహుర్తంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొదటి దశలో సుమారు 10 బిలయన్ డాలర్ల (రూ.70 వేల కోట్ల వరకూ) విలువైన బాండ్ల జారీ ద్వారా రుణాలను సమీకరించాలని చూస్తోందని ఢిల్లీ వర్గాల నుంచి అందిన సమాచారం. దీంతో ఇండియన్ బాండ్స్ గ్రేట్ సేల్కు చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చాయి.
అమెరికన్లకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
తక్కువ వడ్డీతో విదేశీ అప్పులు
దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం విదేశీ అప్పులు తక్కువ వడ్డీతో తీసుకోబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగి విమర్శలు వచ్చినప్పటికీ కేంద్రం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు లేదు. అందుకే తమ లక్ష్యంలో భాగంగా మరో రెండు, మూడు నెలల్లో రోడ్ షోస్ నిర్వహించి వివిధ దేశాల ఇన్వెస్టర్ల నుంచి రుణాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.
విదేశీ అప్పు... రుచి
కేంద్ర ప్రభుత్వం బాండ్లను జారీ చేసి, దానికి ఇంత మొత్తం వడ్డీని నిర్ణయించి వాటిని అమ్మకానికి పెడ్తుంది. దీన్ని కోనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న వారు వాటిని కొనుగోలు చేయొచ్చు. ఇందుకు వడ్డీని కేంద్రం ప్రతీ మూడునెలలకోసారో, లేక ఏడాదికి ఒక సారో ఇస్తుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను బాండ్ల జారీ సమయంలో ఖరారు చేస్తుంది. అయితే చిన్న చిన్న మొత్తాలను అడిగితే వడ్డీ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఒకేసారి పెద్ద మొత్తంలో రుణాలు కావాలని అడిగితే తక్కువ వడ్డీకే అప్పు దొరుకుతుందనేది కేంద్రం ఆలోచన. అందుకే ఫస్ట్ ఫేజ్లోనే పది బిలియన్ డాలర్లకు గ్లోబల్ బాండ్లను జారీ చేయబోతోంది.
పెట్టుబడి ఉపసంహరణ లక్ష్యాలు అందుకోలేకపోవడం, రుణాల సమీకరణకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో కేంద్రం విదేశీ అప్పుకే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. ఇందుకోసం మొదట అమెరికా కంటే జపాన్, యూరోప్ దేశాలకే అధిక ప్రాధాన్యమిస్తోంది. ఎందుకంటే ఆ యా దేశాల కరెన్సీల్లో ఒడిదుడుకులు అంత ఎక్కువగా ఉండవు. అదే సమయంలో అమెరికన్ డాలర్లో కూడా రుణాలు తీసుకునే మార్గాన్నీ అన్వేషిస్తోంది. ఎందుకంటే.. ఇతర కరెన్సీలతో పోలిస్తే యూఎస్ డాలర్లో లిక్విడిటీ చాలా ఎక్కువ. అయితే ఎంత వడ్డీని కేంద్రం ఆఫర్ చేస్తోందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, ఈ బాండ్స్ మెచ్యూరిటీ (కాలపరిమితి)పదేళ్లు ఉంటుందని తెలుస్తోంది.
అప్పులు తెస్తా.. భారం తగ్గిస్తా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆర్థికవేత్తలను కాస్త కన్ఫ్యూజన్కు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. దేశ ద్రవ్యలోటును 3.4 నుంచి 3.3 శాతానికి తగ్గించడమే ఏకైక లక్ష్యమని ఓ వైపు చెబ్తూనే.. మరో వైపు కొత్త రుణాలను తీసుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యపడ్తుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం విదేశాల నుంచిపెద్ద ఎత్తున అప్పులు తీసుకోవడం కాస్త ఆందోళనను కలిగిస్తోంది. ఎందుకంటే దేశ వృద్ధి రేటు ఈ ఏడాది 7 కంటే తక్కువ శాతమే నమోదయ్యే సూచనలున్నాయి. ప్రపంచ వృద్ధిరేటే మందగిస్తోందని సాక్షాత్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చెబ్తోంది. ఇలాంటి తురణంలో ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. మరి ప్రభుత్వ మదిలో ఎలాంటి ఆలోచన ఉందో చూడాలి.