ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాల కోత!
భారత్ ను మందగమనం వెంటాడుతోందా ? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒక వైపు ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా విశ్వ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నా... దేశీయంగా మాత్రం అనుకూల వాతావరణం కనిపించటం లేదు. ఆటోమొబైల్ రంగానికి విడి భాగాలను తయారు చేసే ఆటో కంపోనెంట్స్ పరిశ్రమ భయాందోళన చెందుతోంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఈ రంగంలో కనీసం 10 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొంత కాలంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఆటోమొబైల్ రంగం అమ్మకాలు తగ్గిపోయాయి. నెల నేలకూ పరిస్థితి దిగజారుతోంది. అందుకే ... ఈ రంగంపై ఆధారపడి పని చేసే ఆటో కంపోనెంట్స్ పరిశ్రమ అంతగా ఆందోళన చెందుతోంది.
నిస్సాన్లో 10,000 ఉద్యోగాల కోత, కారణాలివే
50 లక్షల మందికి ఉపాధి...
దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే ప్రముఖ రంగాల్లో ఆటో కంపోనెంట్స్ పరిశ్రమ కూడా ఒకటి. భారత దేశంలో ఈ రంగం సుమారు 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా ఇంతకు రెండు మూడు రేట్ల అధిక ఉపాధి లభిస్తోంది. కానీ... ఇటీవలి పరిణామాలు ఈ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు ఐదో వంతు ఉద్యోగాలపై వేటు పడే అవకాశం ఉండటంతో పరిశ్రమ కలవర పడుతోంది.
ఉత్పత్తి కోత ....
భారత్ లో ఒకటని కాకుండా అన్ని రకాల ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోవడం బహుశా ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. లగ్జరీ కార్లు, ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, టూ వీలర్స్ ఇలా అన్నింటిదీ నేల చూపే. దీంతో, ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 20% మేరకు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. దీంతో ఆమేరకు ఆటో కంపోనెంట్స్ కు గిరాకీ తగ్గుతుంది. అంటే, ఐదో వంతు మేరకు ఉద్యోగాలకు కోట పడే అవకాశాన్ని కొట్టి పారేయలేమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వమే కాపాడాలి...
మందగమనం వల్ల ఉద్యోగుల మీద కత్తి వేలాడుతున్న వేళ ఈ రంగాన్ని ప్రభుత్వమే కాపాడాలని ఆటో కంపోనెంట్స్ రంగ సమాఖ్య ఆటో కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరార్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (ACMA) విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం తమ రంగం సంక్షోభంలో ఉందని, వాహనాల ఉత్పత్తి 15-20% మేరకు తగ్గటం వల్ల .. దాని ప్రభావంతో దాదాపు 10 లక్షల ఉద్యోలు పోయే అవకాశం ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ వెంకటరమణి న్యూ ఢిల్లీ లో విలేకర్లకు తెలిపారని పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్యోగుల కొత్త ప్రారంభమైందని ఆయన తెలిపారు.
జీఎస్టీ ప్రభావం....
ఆటోమొబైల్స్ రంగం వలే... ఆటో అనుబంధ రంగమైనా ఆటో కంపోనెంట్స్ రంగం కూడా అధిక జీఎస్టీతో ఇబ్బంది పడుతోంది. ఈ రంగంలో ఇప్పటికీ కొన్ని పరికరాలపై 28% జీఎస్టీ అమలు అవుతోంది. మిగితా విడి బాగాలపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే సంక్షోభంలో కూరుకు పోయిన ఆటో కంపోనెంట్స్ రంగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే జీఎస్టీ ని 18% నికి తగ్గించాలని రామ్ వెంకటరమని డిమాండ్ చేసారు. ఇంకా 30% పరిశ్రమ అత్యధిక జీఎస్టీ రేటు పరిధిలో ఉండటం సరికాదని ఆయన హితవు పలికారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై వివరణ...
ఆగమేఘాలపై భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అసలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సహా ఇతర అంశాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆటో కంపోనెంట్స్ రంగం డిమాండ్ చేస్తోంది. ఆదరాబాదరాగా ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తే భారత దిగుమతుల భారం పెరుగుతుందని రామ్ వెంకటరమని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ రంగంపై పూర్తి స్పష్టతను ఇచ్చాకే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.