పీఎం-కిసాన్ స్కీం తడబడుతోందా? 2 విడతల్లో ఎంత ఇచ్చారంటే?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి నెలలో రైతులకు ఆదాయ మద్దతు పథకం లేదా పీఎం కిసాన్ యోజనను ప్రకటించినప్పుడు ప్రశంసలు వెల్లువెత్తాయి. బీజేపీ రెండోసారి విజయం సాధించినప్పుడు, వారి గెలుపులో పీఎం కిసాన్ యోజన పాత్ర కూడా ఉందని అందరూ భావించారు. తిరిగి అధికారాన్ని చేపట్టాక మోడీ ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని రైతులు అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ ఈ పథకం కిందకు 14 నుంచి 15 కోట్ల మంది రైతులు వస్తారని అంచనా వేశారు. వారికి ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం ఇస్తారు. మూడు విడతల్లో.. ఒక్కో విడతకు రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.. ఇవీ
పీఎం-కిసాన్ యోజన తడపడుతోందా?
అయితే పీఎం కిసాన్ యోజన స్కీం తడబడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ మినిస్ట్రీ అధికారిక పోర్టల్ ప్రకారం జూలై 22వ తేదీ వరకు కేవలం 5.6 కోట్ల మంది రైతులు మాత్రమే వ్యాలిడేట్ అయ్యారు. అంటే అర్హత కలిగిన రైతుల్లో ఇది కేవలం 37 శాతం మాత్రమే. అంతకుముందు, మొదటి విడతలో అర్హతగల రైతుల్లో 27% (4.15 కోట్లు) మందికి మాత్రమే రూ.2,000 జమ చేశారు. మొదటి విడతలో పంపిణీ చేసిన మొత్తం రూ.8,290.61 కోట్లు అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూలై 19న రాజ్యసభలో వెల్లడించారు.
రెండు విడతల్లో ఎంత ఇచ్చారంటే..
రెండవ విడత (రూ.2,000 చొప్పున) పంపిణీ కొనసాగుతోంది. దాదాపు రూ.6,355.86 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. అంటే అర్హత కలిగిన రైతులలో 21% మందికి మాత్రమే జమ చేయబడింది. మొదటి విడతలో పొందిన వారిలో కూడా కొందరికి రాలేదు. ప్రతి విడతలోను ఆధార్, బ్యాంకు ఖాతాలు వంటి ధృవీకరించుకునే సమస్య ఎదురు కావడం సరికాదు. మొదటిసారి జమ చేసినప్పుడే అన్నింటిని వెరిఫై చేసి, క్లియర్ చేసి ఉండాల్సిందని అంటున్నారు. తొలి విడత కోసం రూ.20,000 కోట్లు కేటాయించారు. కానీ రెండు విడతల్లోను కలిపి రూ.14,647 కోట్లు రైతులకు అందాయి.
రూ.లక్ష కోట్లకు పైగా..
2018-19లో పీఎం కిసాన్ స్కీం కోసం రూ.20,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2019-20 ఏడాదిలో రూ.87,218 కోట్లు అంచనా వేసింది. మొత్తం రూ.1,07,218 కోట్లు. కానీ రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అయింది రూ.14,647 కోట్లు. పలు రాష్ట్రాలు పీఎం కిసాన్ యోజనకు దూరంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ స్కీం తమకు వద్దని తెలిపింది. బీహార్ వంటి రాష్ట్రాల్లో అర్హత కలిగిన రైతుల జాబితాను ఇంకా పూర్తి చేయలేదు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువమంది రైతుల జాబితా వ్యాలిడేట్ అయింది. తొలి స్థానంలో యూపీ ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది.