'మీవల్లే అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం రద్దు, రాజధానిలో ధరలు తగ్గాయా?
అమరావతి: టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, రైతులు, మేధావులు, ఎన్జీవోల ఫిర్యాదులపై స్పందించిన ప్రపంచ బ్యాంకు బృందం నిర్వహించిన తనిఖీల్లో నాటి ప్రభుత్వం అక్రమాలు బయటపడ్డాయని, దీంతో అమరావతికి రుణం ఇవ్వడానికి ముందు తాము సమగ్ర దర్యాఫ్తు చేస్తామని ప్రపంచ బ్యాంకు చెప్పగా, ఇది దేశ సార్వభౌమాధికారానికి భంగమని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని, దీంతో రాజధానికి రుణ సహాయం ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు రద్దు చేసుకుందని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇవ్వడానికి నో చెప్పడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీలో వాగ్యుద్ధం జరిగింది.
ఆంధ్రప్రదేశ్కు ఎన్టీపీసీ లీగల్ హెచ్చరికలు
అది ల్యాండ్ ఫూలింగ్
అమరావతిలో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ జరగలేదని, ల్యాండ్ ఫూలింగ్ జరిగిందని బుగ్గన అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్నారు. భూముల కోసం రైతులను బెదిరించారని, రోడ్ల నిర్మాణ టెండర్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుంటే అమరావతి బాండ్ల పేరుతో అధిక వడ్డీకి రూ.2వేల కోట్ల బాండ్స్ సేకరించారని ఆరోపించారు.
రూ.5వేల కోట్లు రుణాలకు నాడు కేంద్రం ఓకే
అంతకుముందు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుంచి రూ.5వేల కోట్ల రుణం సేకరించేందుకు కేంద్రం అనుమతిచ్చిందని, ప్రపంచ బ్యాంక్ రూ.2,100 కోట్లు, ఆసియా బ్యాంకు రూ.1,500 కోట్లు సమకూర్చితే ఏపీ ప్రభుత్వం వాటాగా రూ.1,500 కోట్లు కేటాయించేలా నిర్ణయించారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం రైతులను బెదిరించి, పర్యావరణం, మానవ హక్కులకు భంగం కలిగిస్తూ ముందుకు సాగడంతో వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లాయన్నారు. రాజధానిని పక్కన పెడితే ఏపీలో ఇతర అభివృద్ధికి సహకరిస్తామని వరల్డ్ బ్యాంక్ తెలిపిందని బుగ్గన అన్నారు.
వైసీపీ వల్లే రుణం రద్దు
చంద్రబాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వల్లే రుణం రద్దయిందని, రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎవరూ చెప్పలేదన్నారు. జగన్ తీరు చూస్తే చంద్రయాన్ 2లోను అవినీతి జరిగిందని అంటారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంపై ఆసక్తి లేదని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే వరల్డ్ బ్యాంకుకు సమాధానం పంపేదని, కేంద్రంలో తమకు అనుకూల ప్రభుత్వం ఉన్నందున రుణం వచ్చేలా చేసుకునేదన్నారు.
ప్రపంచ బ్యాంక్ అలా చెప్పలేదు
అసలు, రైతులు, మేధావులు, ఎన్జీవోల పేరుతో నాడు వైసీపీ వారే అవినీతి జరిగిందంటూ ఫిర్యాదులు చేయించారని చంద్రబాబు చెప్పారు. ప్రపంచ బ్యాంక్ బృందాలు మూడుసార్లు రాజధానిలో పర్యటించాయని, అధికారులు, స్థానిక రైతులు, ఫిర్యాదుదారులు చెబుతున్నవాటిలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని బ్యాంక్ చెప్పిందే తప్ప అవినీతి జరిగిందని చెప్పలేదని గుర్తు చేశారు. తాము రైతులకు ఇచ్చిన భూముల్లో రాయపూడి వంటి చోట్ల వాణిజ్య స్థలం ధర ఓ దశలో రూ.60 వేల వరకు వెళ్లిందని, ఇప్పుడు రూ.20వేలకు పడిపోయిందన్నారు.