రూ.66,00,00,00,00,000 ఎగిరిపోయాయ్..! నిర్మల మొదటి బడ్జెట్ ఎఫెక్ట్
అక్షరాలా ఆరు లక్షలా అరవై కోట్ల రూపాయలు. అవును ఏకంగా రూ.6.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను స్టాక్స్ కోల్పోయాయి. నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకూ ఇన్వెస్టర్లు నిట్టనిలువునా నష్టపోయిన సంపద ఇది. ఇంత కఠినమైన, నిర్దాక్షిణ్యమైన బడ్జెట్ను తాము ఎప్పుడూ చూడలేదంటూ ఎఫ్ఐఐలు క్యూ కట్టి మరీ ఈ దేశం నుంచి పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ప్రీ బడ్జెట్ ర్యాలీలో భాగంగా నిఫ్టీ 12100 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది.
విపరీతమైన అంచనాల నడుమ మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎవరూ ఊహించని అనేక పన్నులకు శ్రీకారం చుట్టారు. సూపర్ రిచ్, అల్ట్రా రిచ్పై పన్నులను పెంచారు. దీంతో అల్ట్రా రిచ్ జనాలు సుమారు 45 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిని పునరాలోచించే ప్రసక్తే లేదంటూ ఆర్థిక మంత్రి పార్లమెంటులో కుండబద్దలు కొట్టారు. చెప్పిన తీరు, చెప్పిన సీరియస్నెస్ కూడా మార్కెట్ వర్గాలను కాస్త ఆందోళనకు గురిచేసింది. దీంతో పెద్ద ఎత్తున సెల్లింగ్ మొదలైంది.
స్టాక్ మార్కెట్లు కకావికలం ! బ్యాంకులు బోల్తా
మార్కెట్ కాపిటలైజేషన్
బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.151.35 లక్షల కోట్లుగా ఉండేది (ఇది జూలై 5వ తేదీన). అదే ఈ రోజు ఇది రూ.144.76 కోట్లుగా ఉంది. అంటే సుమారు రూ.6.59 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. ఇది మరింతగా దిగివచ్చే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు మరింత ఆందోళనలా ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో ముందే వర్షాభావ పరిస్థితులతో పాటు వృద్ధి సమస్యలు నెత్తినపడ్డాయి. ఇవన్నీ ఒకేసారి దాడి చేయడంతో మార్కెట్ కుప్పకూలింది. అయితే ప్రభుత్వం కాస్త ఇలాంటి విషయాలను సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
తీసేసింది రూ.16 వేల కోట్లే
డిపాజిటరీల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఇప్పటివరకూ ఉపసంహరించుకున్న నిధుల మొత్తం రూ.7712.12 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో డెట్ మార్కెట్ల నుంచి రూ.9371 కోట్లను తీసేసుకున్నారు. అయితే ఇంతకు ఎన్నో రెట్లతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది.
463 స్టాక్స్కు పెద్ద దెబ్బ
మార్కెట్ పతనంలో ఈ రోజు ఏకంగా 463 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. అందులో అసీల్యా కాలే, అక్షర్ కెమ్, అరబిందో ఫార్మా, బిఏఎస్ఎఫ్, కేర్, సియట్, సైయెంట్, ఐషర్, గోద్రెజ్ కన్స్యూమర్, హెచ్ ఈజీ, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, నీల్ కమల్, రూపా అండ్ కంపెనీ, ట్రైడెంట్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, వి2 రిటైల్, వెంకీస్, వీఎస్టీ టిల్లర్స్, వండర్ లా హాలిడేస్ వంటి ఎన్న స్టాక్స్ మల్టీ ఇయర్ లో స్థాయిలను టచ్ చేస్తున్నాయి.