ఎయిరిండియాలో ప్రమోషన్లు, నియామకాలు నిలిపివేత
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను వీలైనంత త్వరగా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త నియామక ప్రక్రియను నిలిపివేసింది. రూ.50వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని విక్రయం కోసం కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీని నియమించారు. ఇప్పుడు నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం.
మీ మొబైల్ ఫోన్తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరిక
నాలుగైదు నెలల్లో విక్రయం
ఎయిరిండియాలో సుమారు 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. వాటా విక్రయ ప్రక్రియ కోసం ఎయిరిండియా ఖాతాలను ఈ నెల 15న ముగించామని, ఈ వివరాలనే వీటిని బిడ్స్ ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. తాజా పరిస్థితిపై ఎయిరిండియా స్పందించవలసి ఉంది.
ఏవీ పెండింగులో ఉండవద్దు
ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి వేతనాలు, ఇతర చెల్లింపులు పెండింగ్లో ఉండవద్దని ఎయిరిండియా ఇప్పటికే ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. ఎయిరిండియాలో 76% వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం 2018లోనే ప్రయత్నాలు చేసింది. కానీ అది సఫలం కాలేదు. ప్రభుత్వం తన వద్ద 24% వాటాను పెట్టుకోవాలనుకోవడం, అధిక రుణ భారం వల్ల నాటి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు
ఎయిరిండియా వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేల్కు ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని, నాలుగైదు నెలల్లో దీనిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామని సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్నారు. దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని DIPAM (డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్) సెక్రటరీ అటన్ చక్రబర్తి పదిహేను రోజుల క్రితం తెలిపారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది.