ఆంధ్ర ప్రదేశ్కు వరల్డ్ బ్యాంకు షాక్... 300 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంకు షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి లో ప్రతిపాదించిన ఒక ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గినట్లు ప్రకటించింది. ఇది ఏకంగా 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ 2,100 కోట్లు) ప్రాజెక్ట్ కావడం గమనార్హం. ఈ విషయాన్నీ వరల్డ్ బ్యాంకు తన వెబ్సైటు లో పొందుపరిచినట్లు IANS వార్త సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ కు అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావడం విశేషం. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి సంబంధిన ప్రాజెక్ట్ కావడంతో ఇప్పుడు ... కొత్తగా ఏర్పడిన వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మొత్తం విలువ 750 మిలియన్ డాలర్లు...
2016 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. దీనిని 750 మిలియన్ డాలర్ (సుమారు రూ 5,000 కోట్లు) తో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అయితే, అందులో 300 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చేందుకు వరల్డ్ బ్యాంకు అంగీకరించింది.
అదే అసలు కారణమా...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళల ప్రాజెక్ట్ అమరావతి. ఇందుకోసం ఏకంగా 30,000 ఎకరాల సాగు భూమిని రైతుల నుంచి సమీకరించి రాజధాని కట్టాలని ఆయన తలపోశారు. ఇందుకు రైతులు కొందరు స్వాచ్చ్చందంగా ముందుకు వచ్చి తమ భూములను ప్రభుత్వానికి అప్పగించగా... మరికొంత మంది రైతులు మాత్రం వ్యతిరేకించారు. కొందరు కోర్టులను ఆశ్రిస్తే.. మరికొంత మంది ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనలు చేసారు. అయితే రాజధాని నిర్మాణం అమరావతి లో జరిగితే పర్యావరణానికి హాని కలుగుతుందని, అలాగే సాగు భూములను కోల్పోయి రైతులు పెద్ద సంఖ్యలో నిరాశ్రయులు అవుతారని ప్రపంచ బ్యాంకునకు రైతులు, ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందని IANS అభిప్రాయపడింది. బహుశా అందుకే, వరల్డ్ బ్యాంకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఉంటుందని పేర్కొంది.
అధికారిక సమాచారం లేదు...
అయితే వరల్డ్ బ్యాంకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆంధ్ర ప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA ) వెల్లడించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ అథారిటీ పర్యవేక్షణలోనే జరుగుతాయి.
రూ లక్ష కోట్లు ...
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని రెండు దశల్లో సుమారు రూ లక్ష కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉంది. 2014 లో ప్రారంభైమైన ఈ ప్రక్రియ ఇప్పటి వరకు సుమారు రూ 35,000 కోట్ల విలువైన ప్రోజెక్టులను ప్రారంభించింది. 217 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో రాజధానిని అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక. 2025 నాటికీ తోలి దశ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ ... రాజధాని కోసం రైతుల నుంచి తీసుకొన్న భూముల విషయం లో అలాగే ఇతర ప్రోజెక్టుల అప్పగింత విషయం లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపత్యం లోనే వరల్డ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం దేనికి సంకేతమో విశ్లేషకులకు కూడా అంతుపట్టని విషయంగా ఉందని అంటున్నారు.