హైదరాబాద్వాసులకు గుడ్ న్యూస్, రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తెలంగాణ పురపాలక చట్టం-2019పై చర్చ జరిగింది. చట్టం ఆవశ్యకత, ముఖ్యాంశాలు, లక్ష్యాలు, ఆలోచనలను సీఎం కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈచట్టం ద్వారా పారదర్శకత వస్తుందన్నారు.
జగన్ అనూహ్య నిర్ణయం, ఒక్క రూపాయికే పంటబీమా: ఇలా చేరండి
జీ ప్లస్ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్
అవినీతి రహిత మున్సిపల్ వ్యవస్థ నిర్మాణం అవుతుందని కేసీఆర్ చెప్పారు. ఈ కొత్త చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంటుందన్నారు. జీ ప్లస్ వన్ వరకు రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు. పట్టణాల్లో 75 గజాలలోపు ఇళ్లను సొంతగా దాదాపు పేదలు నిర్మించుకుంటారు.
ఏడాదికి ఇంటి పన్ను రూ.100 మాత్రమే
పట్టణాల్లోని పేదలు 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి రూపాయికే రిజిస్ట్రేషన్తో పాటు ఏడాదికి ఇంటి పన్ను కూడ రూ.100 మాత్రమే వసూలు చేస్తారు. ఇదిలా ఉండగా, ప్రజలకు మేలు చేసేలా కొత్త చట్టం రూపకల్పన చేశారని చెబుతున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని కొన్ని అంశాలు... ఆఫీస్కు రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్లైన్లో అనుమతి ఉంటుంది. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా ఉంటుంది. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత.
గ్రీన్ కవర్ పాలసీ
పట్టణాలు, పల్లెల్లో గ్రీన్ కవర్ పాలసీ. కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు. హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు. బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు.
కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం. కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర.