జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, త్వరలో ప్రభుత్వ మద్యం షాప్లు
అమరావతి: ఏపీలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏపీ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (APSBCL) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది.
అక్టోబర్ 1 నుంచి నో ప్రైవేటు మద్యం దుకాణాలు
డిస్టిల్లరీలు, బ్రీవరీస్ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, దానిని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించేందుకు ఇప్పటి వరకు పరిమితమైంది. ఇక నుంచి మద్యం దుకాణాలను స్వయంగా నడపనుంది. ఇందుకు వీలుగా చట్ట సవరణ చేయనుంది. ఆ దిశగా డ్రాఫ్ట్ సవరణ బిల్లును కేబినెట్ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుకు శాసన సభ ఆమోదం అనంతరం కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. అప్పటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండవు.
వినియోగం తగ్గించే చర్యలు...
ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం విక్రయాల ద్వారా ఎక్సైజ్ సుంకం దాదాపు రూ.2,500 కోట్ల మేర ఆదాయం వస్తోంది. వ్యాట్ రూపంలో అధనపు ఆదాయం వస్తోంది. ఇప్పుడున్న ధరలు పెంచడం ద్వారా తాగేవారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. సాధ్యమైనంతగా వినియోగం తగ్గించాలని చూస్తోంది.
ప్రభుత్వానికి భారీ ఆదాయం
ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించడం ద్వారా లైసెన్స్ రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. 2017-19లో రూ.500 కోట్ల ఆదాయం వరకు వచ్చింది. ఈ మొత్తం దాకా కోల్పోనుంది. అయితే లైసెన్స్ ద్వారా కమీషన్ రూపంలో చెల్లించే పది శాతం మొత్తం ప్రభుత్వానికి మిగులుతుంది. మొత్తంగా ప్రభుత్వమే మద్యం వ్యాపార నిర్వహిస్తే నెలకు ఒక్కో దుకాణానికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం బాగా ఉంటుందని చెబుతున్నారు.