అనిల్ అంబానీకి భారీ ఊరట...ఆర్ కామ్ ను కొనుగోలు చేయనున్న రిలయన్స్ జియో..?
తమ్ముడి కోసం మరో సారి అన్న ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు అయితన అంబానీ సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్నారు. అన్న ఏది పట్టుకున్న బంగారంగా మారుతుండగా తమ్ముడు అనిల్ అంబానీకి ఇది భిన్నంగా మారింది. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అయితే అనిల్ అంబానీని గట్టెక్కించేందుకు ముఖేష్ అంబానీ తన ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
ముఖేష్ అంబానీకి చెందిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుల్లో ఉన్న అనిల్ అంబానీ ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా అనిల్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో సంస్థ ఆర్ కామ్ సంస్థను కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా ఆర్ కామ్ కు సంబంధించిన టవర్లు, ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేయాలని అనుకుంటోంది. అలా జరిగితే అనిల్ అంబానీకి భారీ ఊరట కలుగుతుంది. అంతేకాదు నవీ ముంబైలోని పలు భూములను కూడా కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంక ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీని కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.25వేల కోట్లు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది.
రిలయన్స్ జియో ఆర్ కామ్ ను కొనుగోలు చేయాలని ఎప్పుడో అనుకుంది. రూ.7,300 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని భావించినప్పటికీ టెలికాం శాఖ నుంచి అనుమతులు లభించకపోవడంతో బ్రేక్ పడింది. ఆర్ కామ్ అప్పులను తీర్చేందుకు జియో ఒప్పుకోకపోవడంతో టెలికాం శాఖ అనుమతి నిరాకరించింది. ఇప్పటికే ఆర్ కామ్ కు సంబంధించి ఫ్రీక్వెన్సీని 21 సర్కిళ్లలో జియో వినియోగిస్తోంది. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ముఖేష్ అంబానీకి వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. అంబానీ కుటుంబం ఎప్పటికైనా ఒక టెలికాం కంపెనీని ఏర్పాటు చేయాలని భావించిన నేపథ్యంలో తమ కల 2000వ సంవత్సరంలో ఆర్ కామ్ ఏర్పాటుతో తీరింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా తన వంతు సహాయం చేసి ముఖేష్ అంబానీ గట్టెక్కించాడు. ఎరిక్సన్ కు కట్టాల్సిన రూ.580 కోట్లు అప్పును ముఖేష్ అంబానీ చెల్లించాడు.