టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే: నితిన్ గడ్కరీ, ఆర్టీసీ బస్సులకు, స్కూళ్లకు గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: దేశంలో టోల్ ట్యాక్స్ సిస్టం ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లోకసభలో స్పష్టం చేశారు. దేశంలో టోల్ విధానం ముగిసిపోదని, మరిన్ని మంచిరోడ్లు నిర్మించుకోవడానికి, మరింత మంచి సేవలు పొందడానికి ఈ విధానం ఉంటుందన్నారు. టోల్ ధరలు ఎప్పటికి అప్పుడు మారవచ్చునని చెప్పారు. ఐతే, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సులకు మినహాయింపుపై పరిశీస్తున్నట్లు చెప్పారు. వరల్ట్ క్లాస్ ట్రాన్సుపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కట్టుబడి ఉన్నామన్నారు.
ఉద్యోగులకు షాక్, GPF వడ్డీ రేటు తగ్గించిన ప్రభుత్వం
టోల్ ట్యాక్స్పై ఏం చెప్పారంటే..
'టోల్ సిస్టం ఎప్పటికీ ముగిసిపోదు. అయితే వాటి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉండవచ్చు. నా చిన్నప్పటి నుంచి ఈ విధానాన్ని చూస్తున్నాను. మీకు మంచి సేవలు, మరిన్ని మంచి రోడ్లు కావాలంటే చెల్లించాలి(టోల్ ట్యాక్స్). రోడ్ల నిర్వహణకు అవసరమైన డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. టోల్ ద్వారా ప్రజలు చెల్లించిన డబ్బుతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నాం' అని గడ్కరీ అన్నారు.
భూసేకరణే అసలు సమస్య
గత అయిదేళ్లలో 40,000 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మించినట్లు గడ్కరీ తెలిపారు. రోడ్ల విస్తరణకు భూసేకరణ దగ్గరే అసలైన సమస్య ఎదురవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అధిగమించందుకు కొత్త ప్రణాళికలు రచించాలన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. రోడ్లను వేగంగా నిర్మించడం ద్వారా మోడీ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల విలువైన NPAలు ఆదా చేసిందన్నారు.
రోడ్లు బాగున్నందునే అమెరికా ధనిక దేశమైంది
ఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లో వెళ్లేలా కొత్త హరిత ఎక్స్ప్రెస్ వేను త్వరలో చేపడతామన్నారు. ఇది ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని వెనుకబడిన గిరిజన ప్రాంతాల మీదుగా వెళ్తుందన్నారు. భూసేకరణలో రూ.16వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి అక్కడ రోడ్లు బాగుండటం కాదని, రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా ధనిక దేశమయిందని ఆ దేశ మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెన్నడీ అన్నారని గుర్తు చేశారు.
స్కూల్, ఆర్టీసీ బస్సులకు గుడ్ న్యూస్!
అయితే, స్కూల్ బస్సులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులకు టోల్ మినహాయింపును పరిశీలిస్తామని నితిన్ గడ్కరీ అన్నారు. టోల్ ట్యాక్స్ కడుతున్న వారు అలా కట్టాల్సిందేనని, దానిని గ్రామీణ, పర్వత ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1.5 లక్షల మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2020 నుంచి బీఎస్ VI కాలుష్య నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ఎలక్ట్రిక్, బయో ఫ్యూయల్ వెహికిల్స్ త్వరలో రోడ్డు మీదకు వస్తాయన్నారు. దేశంలో 25 లక్షల మంది డ్రైవర్లు అవసరమని, అందువల్ల ప్రతిరాష్ట్రంలో ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.