ఏమిటీ ఫారెన్ కరెన్సీ బాండ్, నష్టమా.. లాభమా: ఆరెస్సెస్ వాదన సరైనదేనా?
ఫారెన్ కరెన్సీ బాండ్స్పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో పాటు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు మంచిది కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)లోని విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా మోడీ ప్రభుత్వం విదేశీ కరెన్సీ బాండ్స్ పైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇది లాంగ్ టర్మ్లో దేశానికి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చే నిర్ణయమని, మన దేశ విధానాలను విదేశాలకు చెందిన ధనవంతులు, వారి ఆర్థిక సంస్థలు నిర్దేశించే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫారెన్ కరెన్సీ బాండ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఫారన్ కరెన్సీ బాండ్స్పై మోడీకి ఆరెస్సెస్ షాక్
ఫారెన్ కరెన్సీ బాండ్ అంటే ఏమిటి, రిస్క్ ఏమిటి?
ఫారెన్ కరెన్సీ బాండ్స్ అంటే.. ఫారెన్ కరెన్సీలో ఇష్యూ చేసి, తిరిగి ఫారెన్ కరెన్సీలోనే చెల్లింపులు జరుపుతారు. ప్రిన్సిపుల్ అమౌంట్, మరియు దాని వడ్డీని కూడా ఫారెన్ కరెన్సీలోనే జరుపుతారు.
ఫారెన్ కరెన్సీ బాండ్ వల్ల నష్టాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఫారెన్ కరెన్సీ బాండ్స్ జారీ చేస్తే రూపాయి విలువ క్షీణిస్తుందని ఇది అతిపెద్ద ప్రమాదమని చెబుతున్నారు. రూపాయి విలువ క్షీణించడం వల్ల అప్పుడు మనం ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి.
రూపాయిపై ప్రభావం ఎలాగో చూద్దాం..
ఉదాహరణ చూద్దాం... రూపాయితో డాలర్ మారకం విలువ రూ.70గా ఉన్నప్పుడు 10 విదేశీ కరెన్సీ బాండ్లను జారీ చేశారనుకోండి. అప్పుడు మీరు 700 రూపాయలు (10 బాండ్లు x 70) పొందుతారు. అయితే, అయిదేళ్ల తర్వాత బాండ్ హోల్డర్లను తిరిగి చెల్లించేటప్పుడు, రూపాయి విలువ డాలర్ మారకంతో రూ.100కు చేరుకుంటే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులే. ఎందుకంటే రూపాయి విలువ పడిపోతే మీరు 100 రూపాయల ప్రకారం దానిని చెల్లించవలసి ఉంటుంది. అంటే మీరు బాండ్లను జారీ చేసినప్పుడు రూ.700 ఉండగా, దానికి బదులు ఇప్పుడు రూ.1000 ప్రకారం చెల్లించవలసి ఉంటుంది. అలాగే, జారీ చేసిన బాండ్స్ కాల పరిమితి ఎంత ఉంటుందో కూడా తెలియదు. మనం కేవలం 5 ఏళ్లకు లెక్కించాం. కాబట్టి కరెన్సీ పరంగా మనకు పెద్ద ఇబ్బంది. రూపాయి అస్థిరతకు కారణమవుతుంది.
భారత ఆర్థిక విధానాలను ఇతరులు నిర్దేశిస్తారా?
ఫారెన్ కరెన్సీ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల విదేశీ రిచ్ పర్సన్స్ భారత ఆర్థిక వ్యవస్థను డిక్టెట్ చేసే పరిస్థితులు ఏర్పడతాయని స్వదేశీ జాగరణ్ మంచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశీ బాండ్స్ జారీ చేస్తే రూపాయి వేగంగా క్షీణించేందుకు కారణమవుతుందని చెబుతున్నారు. అయితే ఇది జారీ చేయబడిన బాండ్ల పరిమాణంపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఏం చేసినా భవిష్యత్తును ఆలోచించి చేస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో భారత్లో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉంది. కాబట్టి భారత్ విధానాలు శాసించే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. గత అయిదేళ్లలోను ఏ విదేశీ కంపెనీలు కూడా భారత్ను శాసించడాన్ని మనం చూడలేదని అంటున్నారు.
టర్కీతో పోలిక ఉందా?
టర్కీ గతంలో అంతర్జాతీయ మార్కెట్స్ నుంచి రుణాలు తెచ్చికుంది. కానీ భారత్ మూలాలు బలంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఇండియాలో ఫారెక్స్ నిల్వలు $430 బిలియన్ డాలర్లు (జూలై 2019) వరకు ఉన్నాయి. ఇందులో విదేశీ కరెన్సీ ఆస్తులు (FCAs), బంగారం నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి విదేశీ కరెన్సీ బాండ్స్ తిరిగి చెల్లించేటప్పుడు పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. భారీ నిల్వలు ఉండటం మనకు ప్లస్ అంటున్నారు. టర్కీతో పోలిక లేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఫారెక్స్ నిల్వలు వేగంగా పెరుగుతున్నాయని, 500 బిలియన్ డాలర్ల మార్క్కు చేరవ అవుతుందని చెబుతున్నారు. ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న... తక్కువ ద్రవ్యోల్భణం కలిగిన.. అధిగ జనాభా కలిగిన దేశం భారత్ అని, టర్కీ కంటే దూసుకెళ్తోందని చెబుతున్నారు.
ఇండియా తక్కువ వడ్డీకి పొందవచ్చు
భారత్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ స్థిరంగా ఉందని, కాబట్టి తక్కువ వడ్డీ వద్ద నిధులు సమీకరించవచ్చు. ఇది 3 నుంచి 3.2 శాతం పరిధిలో ఉండవచ్చు. ఇది భారత్లో ప్రభుత్వ బాండ్ల కంటే చాలా తక్కువ. దాదాపు రెండింతలు 6.36 శాతంగా ఉంటుంది. కాబట్టి నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట పరిమితిలో విదేశీ బాండ్స్ జారీ చేస్తే, దానిని తప్పుబట్టలేమని అంటున్నారు. దీనిని ఆరెస్సెస్ వ్యతిరేకించడం సమంజసమేనా? అంటే జారీ చేయబోయే బాండ్ల పరిమాణంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో జారీ చేస్తే అస్థిరతకు దారి తీస్తుంది. అలా అయితే వ్యతిరేకించడంలో అర్థం ఉంటుందని అంటున్నారు.