మాపై రూ.2,500 కోట్ల భారం, మేం భరించాలా: కేంద్రానికి జగన్ నో
న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (PPA) సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఇంధన కార్యదర్శి గతంలో లేఖ రాయగా, ఇటీవల కేంద్రమంత్రి ఆర్కే సింగ్.. సీఎం జగన్కు లేఖ రాశారు. ఉద్దేశ్యపూర్వకంగా పీపీఏ ఒప్పందాలు తిరగదోడటం సరికాదని స్పష్టం చేశారు. అయితే కేంద్రం సూచనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీపీఏలను సమీక్షిస్తామని చెబుతోంది.

ఏపీ ఖజానాపై కోట్లాది రూపాయల భారం
గత పీపీఏ ఒప్పందాలు ప్రజలపై, ప్రభుత్వంపై భారమని చెబుతూ సమీక్షపై ముందుకే సాగుతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ భారాన్ని మేం భరించాలా? పీపీఏల కారణంగా ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడుతుంటే మౌనంగా ఉండాలా? అని సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం అన్నారు. తమ నిర్ణయంపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి రాసిన లేఖకు వివరణ పంపిస్తామన్నారు.

తగ్గుదల ఇలా...
అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఖజానాపై రూ.2,500 కోట్ల భారం పడుతోందన్నారు. ఏపీలో అయిదేళ్లలో పీపీఏలు ఎక్కువగా జరిగాయని, 3 వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్ కోసం యూనిట్కు రూ.4.84 వెచ్చించారని, 2018-19 నాటికి ఆర్థిక సర్వేలో పవన, సౌర విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గినట్లు కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. 2010లో యూనిట్ ధర రూ.18 ఉంటే 2018 నాటికి అది రూ.2.44కు తగ్గిందన్నారు. 2017 నాటికి పవన విద్యుత్ యూనిట్ ధర సగటున రూ.4.20 నుంచి 2.43కు తగ్గిందని, ఏపీలో మాత్రం పీపీఏ ప్రకారం యూనిట్కు రూ.4.84 చెల్లిస్తున్నారన్నారు. దీనికి స్థిర ఛార్జీలు రూ.1.20 కలిపితే రూ.6కు పైగా అవుతుందన్నారు. థర్మల్, హైడల్ విద్యుత్ కూడా రూ.4.12కే అందుబాటులో ఉందన్నారు.

ప్రజలపై భారం
పైగా సరిపడా విద్యుత్ ఉండగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టెండర్లు పిలవకుండా ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. విద్యుత్ వినియోగంలో 5 శాతం సంప్రదాయేతర ఇంధన విద్యుత్ పరిమితిని ఏపీఈఆర్సీ నిర్దేశించగా, ప్రభుత్వం 23 శాతానికి పైగా వినియోగిస్తూ ప్రజలపై భారం మోపిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగితే పారిశ్రామికవేత్తలు ముందుకు రారన్నారు. ఏపీలో 70 శాతం ఒప్పందాలు అయిదు కంపెనీల చేతుల్లో ఉన్నాయన్నారు.

రూ.39,200 కోట్ల పీపీఏలు
పవన విద్యుత్కు సంబంధించి మొత్తం 221 పీపీఏలు ఉండగా, ఇందులో ఉమ్మడి ఏపీలో 88, విభజన తర్వాత 133 పీపీఏలు ఉన్నాయని, వాటి విలువ రూ.39,200 కోట్లు అని గుర్తు చేశారు. 5వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ రూ.2.70కే ఏపీకి అందించేందుకు ఎలాంటి పీపీఏలు లేకుండానే పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వెళ్లలేమన్నారు. ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుంటే ఎక్కువ ధరలు ఉన్న పీపీఏలను సమీక్షించడంపై రాద్దాంతం చేయడం సరికాదన్నారు. ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థలు దాదాపు రూ.20వే కోట్ల మేర బకాయిలు పడ్డారన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్న అంశాలను సమీక్షిస్తామన్నారు. అక్రమాలు ఉంటే చర్యలు తప్పవన్నారు.


Click it and Unblock the Notifications