జాగ్రత్త!: గడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్ష
న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ జూలై 31వ తేదీలోపు ఫైల్ చేయాలి. ఈ లోపు దాఖలు చేయకుంటే మీకు జరిమానా పడుతుంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు ఈ శిక్ష పడవచ్చు. అందుకే నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఫాం 16 ఇష్యూ చేసేందుకు జూలై 10ని డెడ్లైన్. 2018-19 ఏడాదికి గాను ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మరో పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది.
కొత్త అద్దె చట్టం: ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్
ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే పెనాల్టీ
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం చివరి నిమిషం వరకు వేచి చూడవద్దు. ఇప్పటికే డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే దాఖలు చేయడం మంచిది. ఐటీ రిటర్న్స్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయకుంటే పెనాల్టీ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే కనుక (డ్యూడేట్ దాటితే) 2019-20 అసెస్మెంట్ ఏడాదిలో ఎప్పుడైనా ఫైల్ చేయవచ్చు. కానీ మీరు లేట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీలు
డ్యూ డేట్ (జూలై 31) దాటిన తర్వాత.. డిసెంబర్ 31వ తేదీలోపు ఎప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసినా ఆలస్య రుసుము రూ.5,000 పెనాల్టీ ఉంటుంది. మరింత ఆలస్యంగా అంటే, జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ మధ్య ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 పెనాల్టీ ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రం పెనాల్టీ రూ.1,000 మాత్రమే. ఆలస్యంగా చెల్లించే రిటర్న్స్కు పెనాల్టీతో పాటు డ్యూ-ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. మీరు ట్యాక్స్ చెల్లించేవారా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా ఆలస్యంగా చెల్లించే రిటర్న్స్కు పెనాల్టీ తప్పించుకోలేరనే విషయం గుర్తుంచుకోండి.
డ్యూ-ట్యాక్స్కు వడ్డీ చెల్లింపు
ఆలస్యంగా ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్కు కేవలం పెనాల్టీతో పాటు ఇతర భారం కూడా ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వరకు ప్రతి నెల డ్యూ-ట్యాక్స్ (మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తం) పైన వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఎన్ని నెలలు ఆలస్యంగా చెల్లిస్తే అన్ని నెలలకు వడ్డీ కట్టాలి.
ఆలస్యమైతే ఈ సౌకర్యం కూడా కోల్పోతారు
అంతేకాదు, ఐటి రిటర్న్స్ ఫైల్ సందర్భంగా కొన్ని నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఆలస్యంగా చెల్లిస్తే ఆ వెసులుబాటు కూడా ఉండదు. ఉదాహరణకు కేపిటల్ లాస్ లేదా ఇన్కం హెడ్ హౌస్ ప్రాపర్టీ కింద నష్టం జరిగితే దీనిని క్యారీఫార్వార్డ్ చేసుకోవచ్చు. కానీ నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే ఈ వెసులుబాటు ఉంటుంది.
క్లెయిమ్ పైన వడ్డీని కోల్పోతారు
నిర్ణీత సమయంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ట్యాక్స్ రీఫండ్ పైన వడ్డీ చెల్లిస్తారు. మీ ఆదాయంపై ఎక్కువగా చెల్లించినప్పుడు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే మాత్రం వడ్డీని కోల్పోవాల్సి ఉంటుంది. మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష విధిస్తారు. డ్యూ-ట్యాక్స్ రూ.25 లక్షలకు పైన ఉంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.