మోడీ దెబ్బ, కాంగ్రెస్కు ఆర్థిక కష్టాలు: 2 నెలలుగా జీతాల్లేవు
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆర్థికంగా మరింత చితికిపోయింది. 2014 కంటే మరిన్ని ఎక్కువ సీట్లతో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మరోవైపు, కాంగ్రెస్ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పార్టీ వివిధ స్థాయిల్లో పని చేస్తోన్న తమ నాయకులు, కార్యకర్తలకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేకపోతోంది.
SBI గుడ్న్యూస్, IMPS ఛార్జీల ఎత్తివేత
బడ్జెట్ రూ.50 వేలు తగ్గింపు
రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో నేతలు, కార్యకర్తలు దూరం అవుతున్నారు. ప్రధాన కార్యాలయ సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేకపోతోందట. ఆర్థికంగా చితికిపోయిన పార్టీ.. ఖర్చులు తగ్గించుకోవాలని అనుబంధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా విభాగాలకు బడ్జెట్ను కుదించారు. ఉదాహరణకు సేవాదళ్ నెలవారీ బడ్జెట్ను రూ.2.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు కుదించారు.
ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశం
పార్టీ మహిళా విభాగం, NSUI, యువజన కాంగ్రెస్ విభాగాలు కూడా ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, సోషల్ మీడియా విభాగంలోని వారి సంఖ్య ఇటీవలి వరకు 55గా ఉండగా, 20 మందికి పైగా వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ రాజీనామాకు మద్దతుగా తాము కూడా వెళ్తున్నట్లు వీరు చెబుతున్నప్పటికీ, అసలు విషయం మాత్రం జీతాలు రాకపోవడం వల్లేనని అంటున్నారు.
వేతనాలు ఆలస్యం
ఇప్పటికీ సోషల్ మీడియా విభాగంలో ఉన్న వారికి వేతనాలు ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు. పార్టీ మీడియా విభాగం పరిస్థితి కూడా అదే అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 542 స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగా 303 సీట్లు గెలవగా, కాంగ్రెస్ కేవలం 52 స్థానాలు దక్కించుకుంది.