ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు పెంచుతున్నారా ?
ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది రిటర్న్స్ ఫైలింగ్ తేదీని పొడిగించబోతోందా ? అని అడిగితే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సారి వచ్చిన అనేక కొత్త నిబంధనల నేపధ్యంలో వాటిని అర్థం చేసుకుని, రిటర్న్స్ను ఫైల్ చేయడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు ట్యాక్స్ పేయర్స్. ప్రతీ ఏడాదీ గత ఆర్థిక సంవత్సరం రిటర్న్స్ను ఫైల్ చేయడానికి జూలై 31న తేదీని గడువుగా నిర్ణయిస్తారు. ఈ సారి కూడా 2019-20 ఆర్థిక ఏడాదికి మరికొన్ని రోజుల్లో గడువు ముగియబోతోంది. కానీ దీన్ని పెంచాలనే డిమాండ్ అధికంగా ఉన్న నేపధ్యంలో ఐటీ శాఖ కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని ఢిల్లీ వర్గాలు చెబ్తున్నాయి.
LIC మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్: ప్రీమియం, ఇతర వివరాలు
మారిన నిబంధనలు ఏంటి ? కొత్త ఫార్మ్ ఏంటి
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ను 2019-20 అసెస్మెంట్ ఏడాదిలో సమర్పించాలి. ఇందుకు జూలై 31వ తేదీ గడువుగా ఉంది. అయితే ఓ కమ్యూనిటీ సోషల్ మీడియా వేదిక అయిన 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా అధిక శాతం మంది గడువును పెంచమనే డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లోని సుమారు 10 వేల మంది అభిప్రాయలను సేకరించి, క్రోడీకరించిన లోకల్ సర్కిల్స్. వాళ్ల విశ్లేషణ ప్రకారం సుమారు 7800 మంది చెప్పిన మాట ఏంటంటే.. ఇంకా తమ ఉద్యోగ సంస్థ నుంచి ఫార్మ్-16 అందనేలేదని చెప్పారు. జూలై 31వ తేదీ డెడ్ లైన్ లోపు రిటర్న్స్ దాఖలు చేయడం అసాధ్యమని 28 శాతం మంది చెప్పారు.
ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా నోటిఫై చేసిన ఫార్మాట్ ప్రకారమే సంస్థలు తమ ఉద్యోగులకు టీడీఎస్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంది. కొత్తగా తీసకువచ్చిన ఫార్మ్ 24Q ప్రకారం ఎంప్లాయర్.. తమ ఉద్యోగికి ఎంత జీతం ఇస్తున్నారు, ఇతర ప్రోత్సాహకాలు ఏమేం ఇస్తున్నారు, లాభాల్లో వాటా ఏమైనా ఇస్తున్నారా అనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ఏ ఏ సెక్షన్ల కింద మినహాయింపులు పొందారు అనే వివరాలను కూడా నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఈ కొత్త ఫార్మ్ను ఉద్యోగికి ఇవ్వడంతో పాటు ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కూడా అందజేయాల్సి ఉంది. కొత్తగా వచ్చిన 24Q ఫార్మ్ వల్ల ఎలాంటి అవకతవకలకు పాల్పడేందుకు వీలుండదని, అలానే రీఫండ్స్ కూడా త్వరగా అవుతాయని ఆదాయపు పన్ను శాఖ చెబ్తోంది.
రూ.2.5 లక్షల ఆదాయం ఉన్నా సరే..
ఈ బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం మరో కొత్త మెలిక పెట్టింది. వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్నా సరే ఆ ఏడాదిలో విదేశీ ప్రయాణానికి వెళ్తే వాళ్లు కూడా రిటర్న్స్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా బిల్లు రూపంలోకి రాలేదు. ఫైనాన్స్ బిల్ 2019 పార్లమెంటులో పాస్ అయి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధన ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది.
గడువు పొడిగిస్తారా
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఐటీ శాఖకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. సాధారణంగా ప్రతీ ఏడాదీ గడువు పెంపును అలవాటు చేసుకున్న ఐటీ శాఖ ఈ సారి కూడా అందుకు తగ్గట్టే చేయొచ్చు. అయితే మన జాగ్రత్తలో భాగంగా ముందుగానే పని పూర్తి చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. లేకపోతే అనవసరంగా పెనాల్టీలు చెల్లించే ఇరుక్కోవాల్సి ఉంటుంది.